న్యూఢిల్లీ: రైతులను తప్పుదోవ పట్టించే ట్వీట్లను తొలగించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం వార్నింగ్స్పై ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. స్వేచ్ఛగా, బహిరంగంగా అభిప్రాయాల మార్పిడి, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందని తాము నమ్ముతున్నట్లు వెల్లడించింది.
తమకు జారీ చేసిన నోటీసుపై చర్చించడానికి కేంద్రంతో సంప్రదించామని పేర్కొంది. కొన్ని ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని కేంద్రం తన నోటీసులో స్పష్టం చేసినా.. ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకోలేదు కానీ, ట్వీట్లు చేయడం కొనసాగిస్తామని వివరించింది. కొన్ని ట్వీట్ల కొనసాగింపుపై ప్రభుత్వంతో ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆమె తన వ్యక్తిగత జీవితంపై ఫోకస్ చేయనున్నట్లు ప్రకటించినా.. కేంద్రం నోటీసులపై ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ట్విట్టర్ పేర్కొనడం గమనార్హం.