జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా
సిద్దిపేట అర్బన్, జూలై 15: పల్లె, పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జడ్పీ చైర్పర్సన్ రోజా అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘం సమావేశాలు నేటితో ముగిశాయి. గురువారం స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ది, సాంఘిక సంక్షేమం, పనులు, ప్రణాళిక, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సబ్స్టేషన్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అధిక వర్షాల వల్ల డ్రైనేజీ, రోడ్లపై సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. దుబ్బాకలోని డబుల్ బెడ్రూం కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుమతి, జడ్పీటీసీలు ప్రవళిక, రవీందర్రెడ్డి, మంగమ్మ, లక్ష్మి, సిద్దప్ప, కో ఆప్షన్ సభ్యులు రహ్మానుద్దీన్, డీఆర్డీవో గోపాల్రావు, డీడబ్ల్యూవో రాంగోపాల్, బీసీ సంక్షేమాధికారి సరోజ, ఎస్సీ సంక్షేమాధికారులు రమాచారి, లత, గిరిజనాభివృద్ధి శాఖ అధికారి ఫిరంగి ఇతర అధికారులు పాల్గొన్నారు.