రూ. 50 వేలలోపు పంట రుణాల మాఫీకి నిర్ణయం
15 నుంచి నెలాఖరు వరకు పూర్తికానున్న ప్రక్రియ
ఉమ్మడి జిల్లాలో రూ.50 వేలలోపు పంట రుణాలు పొందిన రైతులు 73,565 మంది
మాఫీ కానున్న రూ.261.20 కోట్లు
సీఎం కేసీఆర్కు మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు
ఆనందంలో రైతు లోకం
సిద్దిపేట, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ పంట రుణమాఫీకి నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న లక్ష రూపాయల్లోపు పంట రుణాల ను నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గతేడాది తొలి విడుతలో రూ.25 వేలలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 62,746 మంది రైతులకు సంబంధించి రూ.91.79 కోట్లు మాఫీ అయ్యాయి. ఈ నెలలో రూ.50 వేలలోపు రుణాలు ఉన్న రైతులందరివి సర్కారు మాఫీ చేయనున్నది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 73,565 మంది రైతులకు గాను రూ.261.20 కోట్లు మాఫీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. తద్వారా రైతులకు రుణ ఉపశమనం కలగనుంది.
గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ నాలుగు విడుతల్లో లక్ష రూపాయల మేర పంట రుణాలను మాఫీ చేస్తున్నారు. 2018 డిసెంబర్ 11 నాటికి పంట రుణాలు తీసుకున్న రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. గతేడాది రూ.25లోపు వారందరివి మాఫీ చేసింది. తాజాగా రూ.50 వేలలోపు రుణాలు ఉన్న రైతులందరివి మాఫీ చేయనున్నది. రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై సీఎం కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది రూ.25వేల లోపు వారివి మాఫీ…
రుణాలను నాలుగు విడుతలుగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, గతేడాది రూ.25వేల లోపు ఉన్నవారివి మాఫీ చేసింది. సిద్దిపేట జిల్లాలో 20,146 మందికి రూ.27.14 కోట్లు, మెదక్ జిల్లాలో 22,097 మంది రైతులకు గాను రూ.34.12 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 20,503 మంది రైతులకు గాను రూ.30.53 కోట్లు, మొత్తంగా 62,746 మంది రైతులకు సంబంధించి 91.79 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది.
రెండో విడుతలో రూ.50వేల లోపు వారివి…
రెండో విడుతలో ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు రూ.50వేల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 24,600 మంది రైతులకు గాను రూ.87కోట్లు, మెదక్ జిల్లాలో 24,200 మందికి గాను రూ.85కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 24,765 మంది రైతులకు గాను రూ.89.20 కోట్లు, మొత్తంగా 73,565 మంది రైతులకు గాను రూ.261.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుతలో రుణమాఫీ చేయనున్నది.
కరోనా కష్టకాలంలోనూ రుణమాఫీ…
రైతుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమానికి ఉంటున్నది. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతులకు ఇచ్చిన మాటను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలో రూ.91.79 కోట్లు పంట రుణమాఫీ చేసింది. రెండో విడుతలో రూ.261.2 కోట్లను మాఫీ చేయనున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఎంత ఆర్థిక భారం పడినా రైతులకు అందాల్సినవి అన్నీ ప్రభుత్వం అందిస్తున్నది. రూ.50వేల లోపు సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉంటారు. ఈ రుణమాఫీ రైతులకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. వానకా ఉమ్మడి జిల్లాకు ‘రైతుబంధు’ కింద సుమారుగా రూ.900కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. దీంతో రైతులకు పంట పెట్టుబడులకు రంది లేకుండాపోయింది. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేసి 72గంటల్లో డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రైతుబీమా పథకం అమలు చేస్తూ ధీమా కల్పిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండగలా మారగా.. తెలంగాణలో పండుగలా మారింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీకి అర్హత పొందిన రైతులు 5,11,883 మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 1,67,771 మందికి గాను రూ.1074.8 కోట్లు, మెదక్ జిల్లాలో 1,53,883 మంది రైతులకు గాను రూ.914.9 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 1,90,002 మంది రైతులకు గాను రూ.1297.1 కోట్ల నిధులు అవసరం అవుతాయని వ్యవసాయ, ఆర్థిక శాఖలు ప్రాథమికంగా లెక్కలు గట్టాయి. ఇందుకు గాను ఉమ్మడి జిల్లాలో లక్ష రూపాయల లోపు రైతుల రుణాలను మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.3,286.80 కోట్ల భారం పడనున్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్న సీఎం కేసీఆర్కు ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పక్షాన కృతజ్ఞతలు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హత పొందిన రైతుల రుణాలను రూ.లక్ష వరకు మాఫీ చేస్తున్నారు. తొలి విడుతలో గతేడాది రూ.25వేల లోపు వారివి ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో రూ.50వేల లోపు వారివి రుణాలను ఈ నెల 15 నుంచి నెలాఖరు లోపు మాఫీ చేస్తాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడుతలో సుమారుగా 73,565 పైగా మంది రైతులు ఉంటారు. వీరందరికీ నెలాఖరులోగా మాఫీ చేస్తాం. రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
సీఎం కేసీఆర్ రూ.50 వేల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా రూ.50వేల లోపు బ్యాంకులో రుణం తీసుకున్నాను. నేను తీసుకున్న రుణం ఇప్పుడు మాఫీ అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాలు పోయాయి. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.