సిద్దిపేట, జూలై 18 : లాభాపేక్ష లేకుండా తక్కువ ధరల కే రైతులకు ఎరువులు, పురుగుమందులు అందించేందుకు సిద్దిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో సమీకృత రైతుసేవ ఎరువుల కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన రైతుసేవ కేంద్రాన్ని కార్పొరేట్ కంపెనీ షోరూమ్లను తలదన్నే రీతిలో అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని చెప్పారు. సాగు దిగుబడి పెంచేందుకు ఉపయుక్తమైన పురుగుల మందులు, ఇతర ఉత్పత్తుల వాడకం లాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు డీసీఎంఎస్ నిర్ణయించిందన్నారు. మార్కెట్ ధరకే రైతులకు ఎరువులు విక్రయిస్తామని, రైతులకు దగ్గరగా సేవ లు అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ కనకరాజు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఏఎంసీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యాక్షన్ ఎయిడ్ సాయం అభినందనీయం..
కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించిన యాక్షన్ ఎయిడ్ సంస్థ సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్రావు అన్నారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ అందించిన రూ.20 లక్షల విలువైన 10 లీటర్లు, 5 లీటర్లు సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆక్సిజన్ అవసరమయ్యే ప్రభుత్వ దవాఖానలు, గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కొవిడ్ బాధితుల కోసం వినియోగించాలని తన ఓఎస్డీ బాలరాజుకు మంత్రి సూచించారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ స్ఫూర్తిగా తీసుకొని సిద్దిపేట జిల్లాలోని మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ సంస్థ రీజనల్ మేనేజర్ ఆంజనేయులు, ప్రోగ్రాం ఆఫీసర్ ఫణీంద్ర, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధి శంకర్ ఉన్నారు.
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి..
సీఎం సహాయనిధి నిరుపేదలకు ఓ వరమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 32 మంది లబ్ధిదారులకు రూ.9.96లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన బాలయ్యకు రూ.85 వేల ఎల్వోసీ పత్రాన్ని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్ కొడుకు కలెక్టర్, డాక్టర్ కావాలి..
ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్, ఇంజినీర్, డాక్టర్ కావాలని మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. పట్టణంలోని గంగపుత్ర సంఘం భవనంలో జిల్లా ఆటోక్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 137 మంది ఆటోడ్రైవర్లకు యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ఆటో డ్రైవర్ల మధ్య ఐక్యతకు నిదర్శనమే ‘ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ’ అని, ఈ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. క్రమం తప్పకుండా పొదుపు చేపట్టి క్రెడిబిలిటి సంపాదించాలన్నారు. ఆటోడ్రైవర్ల జీవన ప్రమాణాలు పెరిగితే అంతకు మించిన సంతోషం లేదన్నారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ రాష్ర్టానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా విపత్కర సమయంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించి వారికి భరోసా కల్పించామన్నారు. మీ అభివృద్ధి కోసం తక్కువ వడ్డీకే గతంలో రూ.5 వేల రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని, రూ.10 వేల రుణ పెంపు సాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోడ్రైవర్లు దురలవాట్లకు దూరంగా ఉండి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ఎన్సీడీసీ ద్వారా ఆటో డ్రైవర్లకు రుణ సహాయం అందించే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీంతో భవిష్యత్లో సొంతంగా ఆటో కొనుక్కునే స్థాయికి ఆటో డ్రైవర్లు చేరుకుంటారన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సొసైటీ ద్వారా ఆర్థిక సాయం చెక్కులు అందజేశారు.
కష్టాల్లో ఉన్నప్పుడు చేసే పనికి గుర్తింపు..
కష్టాల్లో ఉన్నప్పుడు చేసే పనికి గుర్తింపు ఉంటుందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలోని మదీనా ఫంక్షన్హాల్లో జరిగిన ఫీజర్ల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫ్రీజర్ల పంపిణీ ఓ పుణ్య కార్యక్రమమని, ఇంతకంటే మంచి పనిలేదని, సాయం చేసేందుకు మంచి మనస్సు ఉండాలని, అలాంటి మనస్సున్న దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మతాలకు చెందిన వారికి ఫ్రీజర్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట నుంచే వైకుంఠరథాలు, పరలోక యాత్ర వాహనం, ఆఖరి సఫర్ వాహనాలు ప్రారంభమయ్యాయని, బతికి ఉన్నప్పుడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాందించాలన్నారు. దాతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్ను మంత్రి హరీశ్రావు అభినందించారు. ఆ తర్వాత పట్టణంలో మినీ స్టేడియం లో వాలీబాల్ కోర్టు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.