సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి మున్సిపాలిటీ, అక్టోబర్ 25: ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నది. వైద్యసిబ్బంది ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ, ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్నారు. వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉద్యమంలా కొనసాగుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో మొత్తం జనాభా 17,50,000 జనాభా ఉంది. ఇందులో వాక్సిన్కు అర్హులైన వారు 14, 50,000 ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 10,13,480 వాక్సిన్ తీసుకున్నారు. ఇందులో మొదటి డోస్ తీసకుకున్న వారు 7,47,546 మంది ఉండగా, రెండో డోస్ తీసుకున్న వారు 2,65,934 ఉన్నారు. 60 ఏండ్ల వయసు పైబడిన వారు 75,189 వ్యాక్సిన్ తీసుకున్నారు. 45ఏండ్ల వయసు పైబడిన వారు 3,69,968 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 18ఏండ్ల వయసు పైబడిన వారు 2,38,401 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకా జిల్లాలో 4,36,520 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉన్నది. వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్నది. జిల్లాలోని న్యాల్కల్ మండలంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నది. జిల్లాలో మొత్తం జనాభా 7,67,429 మంది ఉన్నారు. జిల్లాలో 5,47,944 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని టార్గెట్ కాగా, మొదటి డోస్ 4,14,829 మందికి పూర్తిచేశారు. అంటే 75.71 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇంకా మొదటి డోస్లో 1,33,115 మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 20 పీహెచ్సీలు, జిల్లా కేంద్ర దవాఖాన, ఒక ఏరియా దవాఖాన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నాయి. గ్రామాల్లో కరోనా మొదటి, రెండో టీకాలు వేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పది లక్షలు దాటిన వ్యాక్సినేషన్..
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10,13,480 మందికి కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. ఇంకా జిల్లాలో 4,36, 520 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. త్వరలో వారికి పూర్తి చేస్తాం. జిల్లాలో కొవిషీల్ట్ వ్యాక్సిన్ మొదటి డోస్, రెండో డోస్తో పాటు కోవాగ్జిన్ రెండో డోస్ను పటాన్చెరు అర్బన్ హెల్త్ సెంటర్, సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్, సదాశివపేట సీహెచ్సీ, జహీరాబాద్ యూపీహెచ్సీల్లో రెండు, మూడు రోజుల్లో వాక్సిన్ అందించే ప్రక్రియ ప్రారంభిస్తాం. సోమవారం బొల్లారం పీహెచ్సీలో కోవాగ్జిన్ రెండో డోస్ అందించే ప్రక్రియ ప్రారంభించాం. కోవాగ్జిన్ మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవాలి.
త్వరలో వంద శాతం పూర్తి..
మెదక్ జిల్లాలో త్వరలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేస్తాం. ఇప్పటికే 75.71 శాతం పూర్తిచేశాం. మరో 24.29 శాతం పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంటాం. గ్రామాల్లో వైద్య సిబ్బంది కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 5,47,944 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని టార్గెట్ కాగా, మొదటి డోస్ను 4,14,829 మందికి ఇచ్చాం.
సిద్దిపేట జిల్లాలో…
కరోనా నివారణలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 7,72,164 మందికి టీకాలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్ తెలిపారు. వీరిలో వైద్య సిబ్బంది 13,899 మంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ 15,708 మంది, 59 నుంచి 60 ఏండ్ల మధ్య గలవారు 1,72,004 మంది, 45 నుంచి 59 ఏండ్ల మధ్య గలవారు 2,44,808 మంది ఉన్నారు. 18 నుంచి 44 ఏండ్ల గల వారు 3,25,745 మందికి టీకా వేశారు. వీరిలో మొదటి డోస్ 5,51,506 మందికి, రెండో డోస్ 2,20,658 మందికి టీకా వేశారు. జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.