సిద్దిపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గొర్రెల సంపద వృద్ధి చెంది ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందజేస్తున్నది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి గొర్రెలను దశల వారీగా అందించి జీవనోపాధిని కల్పిస్తున్నది. దీంతో గొల్లకుర్మ సభ్యులంతా ఒక సొసైటీలుగా ఏర్పాటయ్యారు. గొర్రెల పెంపకం అభివృద్ధి ద్వారా వారు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వం తొలి విడుత గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది. కాగా, కరోనాతో పాటు ఇతర కారణాలతో నిలిచిపోయిన రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీ చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పెరుగుతున్న ధరల దృష్ట్యా గొర్రెల యూనిట్ కాస్ట్ను ప్రభుత్వం రూ.1.75 లక్షలకు పెంచింది. ఇదివరకే డీడీలు కట్టి ఉన్నవారందరికీ, రెండో విడుత లబ్ధిదారులకు యూనిట్లను ప్రభుత్వం అందిస్తుండడంతో గొల్లకుర్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గొర్రెల యూనిట్లను అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే డీడీలు కట్టిన వారికి పక్క రాష్ర్టాల నుంచి గొర్రెలను తీసుకువచ్చి అందజేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 412, మెదక్ జిల్లాలో 343, సంగారెడ్డి జిల్లాలో 552 సొసైటీలున్నాయి. ఈ సొసైటీలోని సభ్యులకు గొర్రెల యూనిట్లను అందించేందుకు 2019 లో గ్రామ సభల ద్వారా ఏ, బీ లిస్టును సిద్ధం చేశారు. ప్రతి సభ్యుడికి ఒక యూని ట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) అందిస్తున్నా రు. ఒక్కో యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా, ఇందు లో లబ్ధిదారుడు రూ.31,250 లను తన వాటా గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్మును ప్రభుత్వం వెచ్చించి సబ్సిడీపై గొర్రెలను అందించింది. తాజాగా గొర్రెల యూనిట్ ధరను పెంచనున్నట్లు సమాచారం.
కొనసాగుతున్న గొర్రెల పంపిణీ..
పక్క రాష్ట్రం నుంచి మొదటి విడుతలో జిల్లాలోని అన్ని గ్రామాలకు గొర్రెలను పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఏ లిస్టులో 17,286, బీ లిస్టులో 16,184 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 15,232 యూనిట్లకు తొలి విడుతలో గ్రౌండింగ్ చేసి అందజేశారు. మిగిలిపోయిన వాటిలో నుంచి 159 యూనిట్లకు ఈ మార్చి నుంచి అందిస్తున్నారు. ఇటీవల ధూళిమిట్ట మండలంలోని ధూళిమిట్ట, జాలపల్లి, లింగాపూర్ గ్రామాలతో పాటు చేర్యాల మండలంలోని అర్జున్పట్ల గ్రామాలకు సిద్దిపేట తదితర గ్రామాల లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణ జిల్లాల నుంచి తీసుకువచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 371 యూనిట్లకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడుతలో గుర్తించినవి 16,184 యూనిట్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మొదటి విడుతలో 10,142 యూనిట్లకు గాను 9,777 యూనిట్లు పంపిణీ చేయగా, 365 యూనిట్లు పెండింగ్లో ఉన్నాయి. లిస్టు బీలో 10,040 యూనిట్లకు గాను 2,595 యూనిట్లు పంపిణీ చేయగా 7,445 యూనిట్లకు పంపిణీ చేయాల్సి ఉన్నది. సంగారెడ్డి జిల్లాలో 552 సొసైటీలుండగా 31,168 మంది సభ్యులున్నారు. తొలి విడుతలో 16,923 యూనిట్లకు గాను 14,472 యూనిట్లకు గొర్రెలు పంపిణీ చేశారు. బీ లిస్టులో 2,451 యూనిట్లు ఉన్నాయి. 2,369 యూనిట్లకు లబ్ధిదారులు డీడీలు కట్టి ఉండగా, 480 యూనిట్లు పంపిణీ చేశారు. మిగిలిన యూనిట్లను, రెండో విడుత పంపిణీని త్వరలో చేపట్టనున్నారు.
గొల్లకుర్మల ముఖాల్లో సంతోషం..
గొర్రెల పంపిణీతో గొల్లకుర్మల ముఖాల్లో సంతోషం నింపింది తెలంగాణ ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున అందిస్తుండగా, మొదటి విడుతలో పంపిణీ చేసిన గొర్రెల ఉత్పత్తి పెరుగడంతో గొల్లకుర్మ కుటుంబాల్లో చిరునవ్వులు పూశాయి. గొర్రెల పంపిణీ మాత్రమే కాకుండా వాటి ఆరోగ్యం కోసం ప్రభుత్వం 1962 ద్వారా పశువైద్య వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను అందిస్తున్నది. అంతేకాకుండా గొర్రెల మేత కోసం 75 శాతం సబ్సిడీతో దాణాను సైతం అందజేస్తున్నది. గొర్రెల పిల్లలను సాకడంతో గొల్లకుర్మలకు జీవనోపాధి దొరికింది. గొర్రెల పేడను పొలంలో వేయడానికి రైతాంగానికి అమ్మడంతో వారికి మరింత ఆదాయం లభిస్తున్నదని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండో విడుత పంపిణీకి ప్రత్యేక యాప్..
రెండో విడుత గొర్రెల పంపిణీకి ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ పథకాన్ని పకడ్బందీ నిర్వహించేందుకు, అక్రమాలను అరికట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకువచ్చింది. గొర్రెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఈ యాప్ ద్వారా పక్కగా చర్యలు తీసుకుంటున్నారు. యాప్లో గొర్రెల సంఖ్యను నమోదు చేయడంతో పాటు లైవ్ లోకేషన్ ఫొటో ఫీచర్ను ఏర్పాటు చేశారు. కొనుగోళ్ల సమయంలో, గొర్రెలను వాహనాలను ఎక్కించే సమయంలో, అన్లోడింగ్తో పాటు లబ్ధిదారుడికి అందించే వరకు ప్రతి ఫొటో ఫీచర్ను యాప్లో అధికారులు అప్లోడ్ చేయాల్సిందే. ఇవన్నీ లైవ్ ఫొటోలను మాత్రమే యాప్ స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు.
కేసీఆర్ సార్కు ధన్యవాదాలు..
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు సబ్సిడీపై గొర్లు అందజేసి చాలా మంచి పని చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల, కురుమలకు లాభం అయ్యే ఈ పథకం చాలా మంచిది. స్వయం ఉపాధి కల్పించడంలో ఇది కీలకమైనది. ఇటువంటి ఆలోచన చేసిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
సార్ ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే..
ఈ పథకం తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామానికి కేటాయించిన 5 యూనిట్లలో నాకు ఒక యూనిట్ వచ్చింది. అన్నీ బాగున్నాయి. ఈసారి పంపిణీ ఆలస్యమైంది. గిట్టని వారు కేసిఆర్ సార్ మీద ఎన్ని అసత్యపు మాటలు మాట్లాడిన అవన్నీ ఉత్తయే. సార్ ఎప్పుడూ అందరి అభివృద్ధి గురించే ఆలోచిస్తడు.
కుల వృత్తుల బలోపేతం..
గ్రామాల్లో ఉండే గొల్ల కురుమలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. గొర్లు ఇవ్వడం అనేది మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లే. ఇలా సబ్సిడీలో గొర్లు అందజేసే పథకం తెచ్చిన కేసిఆర్ గారికి మా ధన్యవాదాలు.