సిద్దిపేట అర్బన్, జూలై 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, సర్కారు విద్యను బలోపేతం చేయడానికి సీఎం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ‘ఈపామ్ సంస్థ’ సహకారంతో మల్టీపర్పస్ కంప్యూటర్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు వారి సహకారంతో నియోజకవర్గ పరిధిలోని 270 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.1350 విలువ గల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.4 వేల కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. సిద్దిపేట ఇందిరానగర్ పాఠశాలలో అడ్మిషన్ కోసం నావద్దకు రికమండేషన్కు రావడం గర్వంగా ఉందన్నారు.
ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలు సైతం ఇదే పాఠశాలలో చదవడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలలో ఇప్పటికే 1040 అడ్మిషన్లు పూర్తవగా, మరో 270 అడ్మిషన్లు పెండింగులో ఉన్నాయన్నారు. అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టడం నిజంగా అభినందనీయమన్నారు. ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం కమిట్మెంట్తోనే ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే కార్పొరేట్ పాఠశాలల లాగా ఇందిరానగర్ పాఠశాల చరిత్ర తిరగరాసిందన్నారు. మరో 15 మంది ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు కేటాయిస్తామని తెలిపారు. పాఠశాల పునఃప్రారంభం తర్వాత మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈపామ్ డైరెక్టర్ శాంతికుమార్, ఐఎంఎస్ ప్రతినిధులు, సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.