సిద్దిపేట కలెక్టరేట్, జూలై 23 : జిల్లాలో నేడు చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో కనీసం 50వేల మొక్కలను నాటేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే అటవీశాఖ, పురపాలికలో ఏడోవిడతలో నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారి భాగస్వామ్యంతో పెద్దఎత్తున మొక్కలను నాటాలన్నారు. మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో సంతృప్తి స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమానికి సంబంధించి వివరాలు, ఫొటో డాక్యుమెంటేషన్ అదేరోజు డీఆర్డీవో, అటవీశాఖ అధికారులకు అందించాలన్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఎఫ్వో శ్రీధర్, డీఆర్డీవో గోపాలరావు పాల్గొన్నారు.