ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో యమహా భారత మార్కెట్లోకి ఈవీలను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సహాకాల్లో మౌళిక సదుపాయల కల్పన, చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి వంటి కొన్ని కీలక అంశాల్లో సమస్యలను సంస్ధ గుర్తించింది. యమహా సంస్ధ ఇప్పటికే జపాన్ లో ఈవీ వాహనాల తయారీకి సంబంధించిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసుకున్నది.
గత రెండేండ్లుగా తైవాన్ కేంద్రంగా ఈవీలను తయారు చేస్తున్నది. దీనికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలిజీ, స్కిల్స్ కలిగిన ఎక్స్ పార్ట్స్ ను కలిగి ఉన్నది యమహా. భారత్ తో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ఈవీ వాహనాల ఉత్తత్పిపై యమహా ప్రత్యేక దృష్టి సారించినట్లు యమహా గ్రూప్ ఇండియా ఛైర్మన్ మోటోఫుమి షిటారా స్పష్టం చేశారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు యమహా సిద్ధంగా ఉంది.
అయితే ప్రభుత్వం ఈవీ తయారీ సంస్ధలకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తే మినహా తాము పూర్తిస్ధాయిలో ఈవీ మార్కెట్ పై దృష్టిసారిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన వస్తే తాము ఇప్పటికే రూపొందించిన ఈవీ మోడళ్ళను భారత మార్కెట్లో అందుబాటులో ఉంచటంతోపాటు, ఇక్కడే వాటిని తయారు చేస్తామని యమహా సంస్ధ చెబుతున్నది.