చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న గుణశేఖర్ శాకుంతలం సినిమా ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. ఈ సినిమాలో సమంత అక్కినేని టైటిల్ రోల్ చేస్తుంది. ఇది కేవలం ఒక సినిమా కాదు అపురూప ప్రేమకథకు దృశ్య రూపం అంటున్నాడు గుణశేఖర్. అలనాటి శాకుంతల-దుష్యంతుల ప్రేమకావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించనున్నాడు ఈయన. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు (మార్చి 15న)హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులతోపాటు దర్శక నిర్మాతలు హాజరయ్యారు. వాళ్లతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇదిలా ఉంటే ఈ వేడుకలో సమంత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు పదేళ్ల కెరీర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు చేసానని..అద్భుతమైన పాత్రల్లో నటించానని చెప్పింది సమంత. అంతేకాదు ఇన్నేళ్ళలో 50 సినిమాలకు పైగా నటించానని.. హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా చేసానని గుర్తు చేసుకుంది ఈమె. అయితే ఎన్ని పాత్రలు చేసినా కూడా ఒక్కటి మాత్రం అలాగే మనసులో కోరిక ఉండిపోయిందని..దాన్ని ఇప్పుడు గుణశేఖర్ తీర్చేస్తున్నాడని చెప్పుకొచ్చింది సామ్. రాకుమార్తెగా నటించడం తన కల అని..అలాంటి డ్రీమ్ రోల్ కోసమే ఇన్నేళ్లు వేచి చూసానని చెప్పింది సమంత. ఇలాంటి సమయంలో గుణశేఖర్ వచ్చి ఈ కథ చెప్పగానే చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది. ఎన్నో పాత్రల్లో నటించినప్పటికీ ఈ రోల్ చేయలేదనే లోటు ఎప్పటి నుంచో తనలో ఉండిపోయిందని…ఇప్పుడు గుణశేఖర్ వల్ల ‘శాకుంతలం’తో తన కల నెరవేరుతోందని సంతోషించింది సమంత.
తన పదేళ్ల కెరీర్లో గుణశేఖర్, దిల్రాజు..‘శాకుంతలం’ రూపంలో అతిపెద్ద బహుమతి ఇచ్చారని చెప్పుకొచ్చింది సమంత. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందిస్తున్నానని తెలిపింది సామ్. గుణశేఖర్ కుమార్తె నీలిమ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుంది. ఈ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్మోహన్ నటిస్తున్నాడు. ఈ మధ్యే ఈయన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఏదేమైనా కూడా తన డ్రీమ్ ప్రాజెక్టులో సమంత ఎలా కనిపించబోతుందో..? చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.