ఎస్పీ కార్యాలయం వెనుకాల 30 ఎకరాల స్థలం ఖరారు
పరిశీలించిన మంత్రి సత్యవతి, ప్రజాప్రతినిధులు
త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన
మహబూబాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్రపడడంతో పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటికే అధికారులు స్థలాన్ని గుర్తించి, ఖరారు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వెనుకాల 551 సర్వేనంబర్లోని 30 ఎకరాల భూమిలో రెండు కళాశాలలు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుంచి ఆరు కిలోమీటర్లలోపు మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఉండాలన్న నిబంధన మేరకు అధికారులు మూడు కిలోమీటర్లలోపే స్థలాన్ని గుర్తించి, ఖరారు చేశారు. మొదట మల్యాల సమీపంలో, కొత్త కలెక్టరేట్ భవనం వెనుకాల అనంతారం, గాంధీనగర్, జమాండ్లపల్లి- మున్నేరువాగు మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన అధికారులు చివరకు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఎస్పీ కార్యాలయం వెనుకాల ఉన్న స్థలాన్ని ఓకే చేశారు. ఈ స్థలానికి సమీపం నుంచే ఎన్హెచ్-30 వెళ్తుండడం కలిసివస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దీనికి ఒకవైపు ఎస్పీ కార్యాలయం, మరో వైపు కేంద్రియ విద్యాలయం, మరో వైపు జాతీయ రహదారి వెళ్తుండడంతో అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అంటున్నారు. కాగా, ఆ స్థలాన్ని గురువారం మంత్రి సత్యవతిరాథోడ్, జడ్పీచైర్పర్సన్ బిందు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోన్రెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ కొమురయ్య, తహసీల్దార్ రంజిత్కుమార్ పరిశీలించారు. స్థలం ఖరారవడంతో శంకుస్థాపనకు అధికారులు చకచకా ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్థలాన్ని చదును చేసే పనులు ప్రారంభించనున్నారు.
ఎస్పీ కార్యాలయం వెనుకాల నిర్మించనున్న మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన జరుగనుంది. కురవి రోడ్లో సలార్తండా వద్ద నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడంతోపాటు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఉండే అవకాశం ఉందని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి
మహబూబాబాద్, జూన్10 : జిల్లా కేంద్రంలోని కురవి రహదారిలో రూ.60కోట్లతో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించా రు. గురువారం ఆమె కలెక్టరేట్ నిర్మాణ పనులు పరిశీలించారు. కొవి డ్ కారణంగా పనులు ఆలస్యంగా జరుగుతుండడంతో చీఫ్ ఇంజినీర్ గణపతితో ఫోన్లో మాట్లాడి జాప్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనుల శంకుస్థాపనకు త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని, అధికారులు త్వరగా పనులు పూర్తిచేయించాలన్నారు. ఆమెవెంట ఎమ్మెల్యే శంకర్నాయక్, ము న్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్చైర్మన్ ఫరీద్, అదనపు కలెక్టర్ కొమురయ్య, ఆర్ అండ్ బీ ఈఈ తానేశ్వర్, టీఎస్ఎంఐడీసీ డీఈ శ్రీనివాస్, జిల్లా సర్వేయర్ నర్సింహమూర్తి ఉన్నారు.