న్యూఢిల్లీ: వాట్సాప్ తమ కొత్త ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గింది. మే 15లోపు ప్రైవసీ పాలసీని అంగీకరించాలన్న నిబంధనను ఎత్తేసింది. ఆలోపు ఈ పాలసీని అంగీకరించని వారి అకౌంట్లను డిలీట్ చేయబోమని ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది తమ ప్రైవసీ పాలసీని అంగీకరించారని ఆ ప్రతినిధి చెప్పినా, ఎంతమంది అంగీకరించారు.. మళ్లీ ఏ తేదీలోపు దీనిని అంగీకరించాలన్న అంశాలను మాత్రం వెల్లడించలేదు. రానున్న వారాల్లోనూ ఈ పాలసీని అంగీకరించే అవకాశం కల్పిస్తున్నట్లు మాత్రం చెప్పారు.
ఎవరి అకౌంట్లనూ తొలగించం. ఇండియాలో వాట్సాప్ అకౌంట్ను ఎవరూ కోల్పోరు. యూజర్లకు రిమైండర్లను పంపిస్తూనే ఉంటాం అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. కొత్త ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల డేటాను తమ మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకుంటామని వాట్సాప్ చెప్పడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. గతంలో ఫిబ్రవరి 8 వరకే గడువు విధించినా.. తర్వాత మే 15 వరకూ పొడిగించారు. తాజాగా ఆ గడువునూ ఎత్తేసింది వాట్సాప్.
గత కొన్ని నెలలుగా ఈ కొత్త పాలసీపై నెలకొన్న అయోమయాన్ని తొలగించే ప్రయత్నం తాము చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. యూజర్ల వ్యక్తిగత మెసేజ్లను ఫేస్బుక్తో పంచుకోమని, కేవలం బిజినెస్ సమాచారాన్ని మాత్రమే ఇస్తామని వాట్సాప్ వివరణ ఇచ్చింది.