న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో మరణాలు నమోదవగా.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున జనం మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 81,466 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గతేడాది అక్టోబర్ మొదటి వారం తర్వాత ఇన్ని కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. దేశంలో ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో 469 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,03,131కు పెరిగింది.
తాజాగా 50,356 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,15,25,039 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1,63,396 మంది మరణించారని చెప్పింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 6,87,89,138 డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదల కనిపిస్తున్న పదకొండు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.