భద్రాచలం టౌన్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో పోలీసులు 1.98 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ వినీత్ బుధవారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
మంగళవారం భద్రాచలం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈక్రమంలో అటుగా వస్తున్న రెండు కార్లను ఆపి తనిఖీ చేశారు. వాటిలో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు.
కారులో గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్రలోని పూణేకు చెందిన యువరాజ్ శంకర్ దిగ్దే, అనిల్ కాంబ్లీ, దత్తాత్రేయ శివాజీమాటేను అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్ర పూణేకు గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.27.90 లక్షలు ఉంటుందన్నారు.