బెంగళూరు, ఆగస్టు 11: చంద్రుడి ఉపరితలంపై నీరు, హైడ్రాక్సిల్ అణువులు పుష్కలంగా ఉన్నట్టు చంద్రయాన్-2 మిషన్ తాజాగా కనిపెట్టింది. జాబిల్లి రహస్యాలను ఛేదించే క్రమంలో 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో వైఫల్యం చెందింది. మిషన్లో భాగమైన ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత వేగంగా ఢీకొట్టడం తెలిసిందే. అయితే, చంద్రుడి కక్ష్యలోకి పంపించిన ఆర్బిటార్ జాబిల్లికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నది. చంద్రుడి ఉపరితలం మీదనున్న ఖనిజాలను అన్వేషించే క్రమంలో ఆర్బిటార్ మీదనున్న ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) అక్కడి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చిత్రాలను తీసింది. వీటిని విశ్లేషించగా.. 29 డిగ్రీల నుంచి 62 డిగ్రీల ఉత్తర ప్రాంతంలోని చంద్రుడి ఉపరితలంపై పెద్దమొత్తంలో హైడ్రాక్సిల్ (ఆక్సిజన్-హైడ్రోజన్), నీటి అణువులు విస్తరించినట్టు గుర్తించారు. కాగా చంద్రయాన్-1 మిషన్ ఇదివరకే చంద్రుడిపై నీటి జాడను కనుకొనడం తెలిసిందే.
అలా ఏర్పడ్డాయి!
సౌరగాలులు, చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య రసాయనిక చర్యలు జరుగడంతో జాబిలి మీద హైడ్రాక్సిల్, నీటి అణువులు ఏర్పడి ఉండొచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్-డెహ్రాడూన్) శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సూర్యరశ్మి సోకే ఎత్తైన ప్రాంతాల్లో వీటి జాడ ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. భూమిపై పరిమితంగా ఉన్న ఖనిజాలు.. చంద్రుడి మీద ఉన్నాయో? లేదో? అనే కోణంలో చేపట్టే పరిశోధనలకు తాజా ఫలితాలు కొత్త బాటలు వేస్తాయని పేర్కొన్నారు.