నిర్విరామంగా ఎత్తిపోస్తున్న పంపులు
నిండుకుండలా రిజర్వాయర్లు
ఎస్సారార్కు పరుగెడుతున్న కాళేశ్వర జలాలు
పెద్దపల్లి, జూన్ 27(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/ రామడుగు/ మల్యాల/ తిమ్మాపూర్/మెట్పల్లిరూరల్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఆదివారం లింక్-1లోని లక్ష్మీ పంపు హౌస్లో 10పంపుల ద్వారా 2100 క్యూసెక్కులను ఎగువన గల సరస్వతీ బరాజ్లోకి, ఇక్కడి పంప్హౌస్లోని 8 పంపుల ద్వారా పార్వతీ బరాజ్లోకి 23,440క్యూసెక్కులు, ఇక్కడి పంప్హౌస్లోని 10 పంపుల ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 26,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని లింక్-2లోని నంది మేడారం లింక్-2లోని నంది పంపు హౌస్లో 5 పంపుల ద్వారా 18,900క్యూసెక్కులు నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తుండగా అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు చేరుతున్నాయి. ఇక్కడ ఆరు పంపులు ఆన్చేసి 18900 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా ఒకవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయం, మరోవైపు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్హౌస్కు నీటిని తరలిస్తున్నారు. రాంపూర్ వద్ద 2 పంపుల ద్వారా 2900 క్యూసెక్కులను ఎగువన ఉన్న మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట శివారులోని వరదకాలువ 34 కిలో మీటర్ మైలురాయి వద్ద పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడ ఆదివారం రెండు పంపులతో 2,900 క్యూసెక్కుల నీటిని పైభాగానికి వదులుతున్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గాయత్రీ పంప్హౌస్ నుంచి 18900 క్యూసెక్కులు వస్తున్నది. ఇక్కడి నుంచి ఎల్ఎండీకి ఆదివారం నీటిని నిలిపివేశారు. 24.034 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం 19.569 టీఎంసీలుండగా పైనుంచి 3850 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నది. కాగా, తాగునీటి అవసరాలకు ఎల్ఎండీ నుంచి 332 క్యూసెక్కులు అవుట్ఫ్లో రూపంలో వెళ్తున్నట్లు, ప్రస్తుతం 20.424 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నంది పంప్హౌస్ డెలివరీ సిస్టర్న్ల వద్ద జన సందడి
ధర్మారం, జూన్ 27: ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద ఆదివారం జన సందడి కనిపించింది. నంది పంప్హౌస్ నుంచి పలు మోటార్ల ద్వారా కాళేశ్వర జలాల పంపింగ్ డెలివరీ సిస్టర్న్ల నుంచి విడుదలవుతున్న నీటి దృశ్యాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు నీటిని చూస్తూ సందడి చేస్తూ సెల్ఫీలు దిగారు.