బెంగళూరు, మే 17: మనిషికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అది వైరస్ వల్ల సోకిందా.. బ్యాక్టీరియా వల్ల సోకిందా అన్న విషయాన్ని తెలిపే ప్రత్యేకమైన జీవపదార్థాలను (బయో మార్కర్లు) బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవ పదార్థాలను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఓ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఏదైనా ఇన్ఫెక్షన్తో దవాఖానకు వెళ్తే అది వైరస్ వల్లనా, బ్యాక్టీరియా వల్లనా అన్నది గుర్తించకుండానే చాలా మంది యాంటీబయాటిక్స్ రాస్తున్నారు. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై పనిచేస్తాయి. కానీ వైరస్పై పనిచేయవు. ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్ వాడకం వల్ల బ్యాక్టీరియాలు సైతం నిరోధకతను పెంచుకొంటున్నాయి. అదే సమయంలో రోగమొకటైతే మందొకటి వేసుకోవడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్కు ఆ రకమైన మందులు ఇచ్చేందుకు తాజా పరిశోధన దోహదం చేస్తుంది. ‘మానవ శరీరంలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కారకాన్ని బట్టి రక్తంలో వివిధ రకాలైన జీవ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వైరస్ సోకితే ఒకరమైన ఆర్ఎన్ఏ, బ్యాక్టీరియా సోకితే మరో రకమైన ఆర్ఎన్ఏ విడుదల అవుతుంది. దీనిని గుర్తించి చికిత్స అందిస్తే ఔషధాల దుర్వినియోగం తగ్గుతుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.