టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు చాప కింద నీరులా ఎక్కువవుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక.. సైబర్ నేరగాళ్లు అడ్డూఅదుపు లేకుండా చేస్తున్న నేరాలను చూసి భయపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అందుకే.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఎస్బీఐ నడుం బిగించింది. ఇప్పటికే పలు సెక్యూరిటీ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎస్బీఐ తాజాగా తమ యోనో, యోనో లైట్ యాప్స్ కస్టమర్ల కోసం మరో సెక్యూరిటీ అప్ డేట్ ను తీసుకొచ్చింది.
యోనో, యోనో లైట్ యాప్స్ లో సిమ్ బైండింగ్ అనే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆన్ లైన్ మోసాల నుంచి ఎస్బీఐ కస్టమర్లు తప్పించుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగిన కారణంగా.. ఎస్బీఐ కస్టమర్లకు మరింత భద్రతను అందించడం కోసమే ఈ సెక్యూరిటీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎస్బీఐ ప్రకటించింది.
సిమ్ బైండింగ్ ఫీచర్ వల్ల ఏం జరుగుతుందంటే.. ఇక నుంచి కస్టమర్లు ఎస్బీఐ యోనో కానీ.. యోనో లైట్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలంటే.. ఖచ్చితంగా వాళ్లు ఎస్బీఐ బ్యాంకులో తమ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకొని ఉండాలి. వాళ్లు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ సిమ్ ను ఏ డివైజ్ లో ఉంచితే.. ఆ డివైజ్ లో మాత్రమే యోనో, యోనో లైట్ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే.. ఆ యాప్స్ ఇన్ స్టాల్ కావు.
సరికొత్త ఫీచర్ కోసం యోనో, యోనో లైట్ వినియోగదారులు ఖచ్చితంగా ఈ యాప్స్ ను అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడు.. బ్యాంకు.. రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఆ డివైజ్ లో ఉందో లేదో వెరిఫై చేస్తుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. లేదంటే ఆ యాప్స్ ఇన్ స్టాల్ కావు.
ఈ యాప్స్ ఒక మొబైల్ డివైజ్ కు ఒక యూజర్ తరహాలో ఇక నుంచి పనిచేయనున్నాయి. దీని వల్ల.. యోనో, యోనో లైట్ యాప్స్ ద్వారా సైబర్ మోసాలు చేయాలనుకునేవారికి చెక్ పెట్టొచ్చని.. బ్యాంకులో మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోకపోతే అసలు ఆ యాప్ ను ఓపెన్ చేయడమే కుదరదని బ్యాంకు అధికారులు వెల్లడించారు.