చొప్పదండి, జూలై 9: పట్టణ ప్రగతి పకడ్బందీగా చేపట్టి పట్టణాన్ని ఆదర్శంగా నిలుపాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 8, 11వ వార్డుల పరిధిలో కుడిచెరువు పక్కన గల మత్తడిలో ఎక్స్కవేటర్ సహాయంతో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించారు. ఈ పనులను చైర్పర్సన్ ప్రారంభించి మాట్లాడారు. చెరువులో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని సూచించారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చే వాహనాల్లో వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటి సంరక్షించి, హరిత పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, కమిషనర్ అంజయ్య, మేనేజర్ ప్రశాంత్, కౌన్సిలర్లు పెరుమండ్ల మానస-గంగయ్య, రాజన్నల ప్రణీత-రాజు, కొట్టె అశోక్, మాడూరి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు అజ్జు, నాయకులు నలుమాచు రామకృష్ణ, మహేశుని మల్లేశం, ఏఈ రాజేశం తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, జూలై 9: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించి హరిత మండలంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ చిలుక రవీందర్ పిలుపునిచ్చారు. మండలంలోని కోనేరుపల్లి, రుక్మాపూర్ గ్రామాల్లో మెగా ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటి, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఇండ్లల్లోని చెత్తను పారిశుధ్య సిబ్బంది తీసుకువచ్చే వాహనాల్లోనే వేయాలన్నారు. ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలను నాటి, సంరక్షించాలని కోరారు. అనంతరం రుక్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఏపీడీ మంజులాదేవీ, ఎంపీడీవో స్వరూప, సర్పంచులు తులసమ్మ, చిరంజీవి, అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గంగాధర, జూలై 9: మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. వైకుంఠధామాలు, డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించి, తొట్టీలు, నీటి వనరుల వద్ద నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించారు. మార్కెట్, ప్రధాన కూడళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, శుభ్రం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు. గ్రామాల్లో విరిగిన స్తంభాలను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
రామడుగు, జూలై 9: మండలంలోని గోలిరామయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి, ఎక్స్కవేటర్తో కూల్చివేయించారు. లక్ష్మీపూర్లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో యువతులకు పల్లెప్రగతిపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. మోతెలో వీధుల్లో సర్పంచ్ అంబటి నారాయణ పంచాయతీ సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. పందికుంటపల్లిలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను సర్పంచ్ మొగుల్ల ఎల్లయ్య దగ్గరుండి కూల్చివేయించారు. వెదిరలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ప్రత్యేకాధికారి ఏడీ రామారావు పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని సర్పంచులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి పనులపై ప్రత్యేకాధికారి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు, సర్పంచులు వీర్ల సరోజన, తీగల సంగీత, సైండ్ల కవిత, గుండి మానస, పంజాల ప్రమీల, జట్టు రాజేశ్వరి, చిలుముల రజిత, మన్నె దర్శన్రావు, అభిషేక్రెడ్డి, జాడి లక్ష్మి, జవ్వాజి శేఖర్, బండ అజయ్రెడ్డి, వొంటెల అమరేందర్రెడ్డి, బక్కశెట్టి నర్సయ్య, చంటి జీవన్, చాడ ప్రసన్న, అల్గి చైర్మన్ ఉప్పుల అంజనీప్రసాద్, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూలై 9: మండలంలోని గోపాల్పూర్, బొమ్మకల్, చేగుర్తి, చామనపల్లి, నగునూర్, దుర్శేడ్, ఎలబోతారం, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, ఫకీర్పేట గ్రామాల్లో డ్రైడే చేపట్టారు. పారిశుధ్య పనులు చేపట్టి, ఇండ్ల ఆవరణలో పాత కుండలు, తొట్టీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. బొమ్మకల్లో ప్రధాన రహదారి, రాజీవ్ రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. గోపాల్పూర్ సర్పంచ్ ఊరడి మంజులామల్లారెడ్డి, ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.