అబద్ధాల ప్రచారంలో బీజేపీ దిట్ట
మతాన్ని, దేశభక్తిని అడ్డుపెట్టుకుని రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నది
మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్ రూరల్, జూన్ 25: అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట అని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లోని దినేశ్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్కు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, ప్రతి విషయంలో అత్యంత ఉత్సాహంతో ఉండేది యువతేనని, తప్పు జరిగిప్పుడు వెంటనే స్పందించాలని కోరారు. బీజేపీలో సభ్యత్వం ఉన్న వారే దేశభక్తులంటూ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. యువత ఎప్పుడూ తప్పును ఎత్తి చూపాలని సూచించారు. బీజేపీ మతాన్ని, దేశభక్తిని అడ్డుపెట్టుకొని రాజకీయాలను భ్రష్టు పటిస్తున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి రెండు లక్షలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే లక్షా 24వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తి ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని, ఈటల రాజేందర్ పార్టీ నుంచి పోయినా నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన
‘నీ ఆత్మగౌరవాన్ని నీవే చంపుకొని ఆత్మవంచన చేసుకుంటున్నావు.. మరోసారి ఆత్మగౌరవం అనే మాట మాట్లాడడానికి నీకు హక్కులేదు’ అంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ‘అన్నం పెట్టినోనికే ఈటల సున్నం పెడుతడు.. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని, తండ్రి లాంటి కేసీఆర్ను విమర్శించడానికి నీకు నోరెలా వచ్చింది.. కోళ్ల ఫారం నడుపుకొనే నిన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఓనమాలు నేర్పించి పార్టీలో, ప్రభుత్వంలో రెండో స్థానం కల్పించిన ముఖ్యమంత్రిని విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. ‘బీసీ, ఎస్సీ భూములను కబ్జా చేశారని ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే బర్తరఫ్ చేస్తావా? అని సీఎం కేసీఆర్ను అనడానికి నీకు మనసెలా వచ్చింది’ అంటూ ధ్వజమెత్తారు. 2003లో ఉద్యమంలోకి వచ్చినప్పుడు నీవు ఓ అనామకుడివి కాదా..? కేసీఆర్ నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని కన్న కొడుకువలె.. సొంత తమ్మునోలె చూసుకోలేదా? వార్డు మెంబర్గా పనికిరాని నీకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదా? పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఫ్లోర్ లీడర్గా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చింది మరిచిపోయావా? అని గుర్తు చేశారు. ‘హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజకీయ ఓనమాలు తెలియని ఓ అనామకుడిని పెట్టి.. నీ మీద అత్యధిక మెజార్టీతో గెలిపించి.. నిన్ను బురదలో తొక్కేస్తాం’ అంటూ నిప్పులుచెరిగారు. ‘హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోట అని నీ చేతిల పెడితే ఏం అభివృద్ధి చేశావ్?’ అని ప్రశ్నించారు. బీజేపీని తిట్టిన మీరు ఆ పార్టీలో ఎందుకు చేరారో హుజూరాబాద్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో అబద్ధాలు నిజం చేయగల పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీలో ఉండేది దొంగల ముఠా అని, అందులో చేరి కేసీఆర్ను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. ఇక బీజేపీ ఫేక్ మీడియాకు టీఆర్ఎస్ సోషల్ మీడియాకు మధ్య యుద్ధం జరుగబోతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ రెండేండ్లలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆయనను ఎంపీగా గెలిపించినందుకు కరీంనగర్ ప్రజలు బాధపడుతున్నారని, ఆయనకు ఎలాంటి అనుభవం లేదని చెప్పారు. ‘ఈటల రాజేందర్ వంటి వారు టీఆర్ఎస్లోకి వస్తారు.. పోతారు.. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టంలేదు’ అని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు రూ.కోట్ల డబ్బు సంచులతో వస్తున్నారని, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దొరికిన డబ్బంతా వాళ్లదేనని, అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుతుందని జోస్యం చెప్పారు. డబ్బులతో నీచ రాజకీయం చేసేది బీజేపీ అని దుయ్యబట్టారు. హుజూరాబాద్లో ఎప్పటికీ ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని యువతకు పిలుపునిచ్చారు.
బీజేపీ వాళ్లకు మైక్ దొరికితే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, అదే తాము తిట్టుడు మొదలు పెడితే ఎలా ఉంటుందో? అర్థం చేసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను చూసే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సతీశ్కుమార్, ఆరూరి రమేశ్, నరేందర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరావు, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, టీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, వకుళాభరణం కృష్ణమోహన్, వొడితల ప్రణవ్బాబు, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లు సతీశ్రెడ్డి, దినేశ్, జగన్మోహన్రావు, సర్పంచ్ కొడుగూటి శారద, టీఆర్ఎస్ యువజన, విద్యార్థి సంఘం నాయకులు భిక్షపతి, శివకృష్ణ, గందె సాయి, మధుకర్రెడ్డి పాల్గొన్నారు.