విద్యానగర్, జూన్ 28 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పారిశుద్ధ్య, నీటి సరఫరా కార్మికులకు ఆయన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవతో కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యిందని అన్నారు. పలు గ్రామాలను కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ జనాభా లక్షకుపైగా దాటిందని తెలిపారు. దీంతోపాటు రద్దీ కూడా బాగా పెరిగిందన్నారు. పట్టణ పరిశుభ్రత కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కరోనా నేపథ్యంలోనూ గతేడాది నుంచి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కార్మికులు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. అవుట్సోర్సింగ్, శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న 305 మందికి, వాటర్ వర్క్స్లో 146 మందికి మొత్తం 451 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు జతల బట్టలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు గాను పురుషులకు రెండు జతలకు రూ. 1200, మహిళా కార్మికులకు రూ. 800 అందజేస్తున్నారని వివరించారు. మొత్తం సుమారు 5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ మేరకు జీతాలు కూడా పెంచినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, స్థానిక కౌన్సిలర్ మాడూరి అనూష, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.