నిర్మల్ : భైంసా అల్లర్ల వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న మహాగావ్ గ్రామంతోపాటు భైంసా పట్టణంలో శనివారం ఆయన పర్యటించి, బాధితులను పరామర్శించారు. అధైర్యపడొద్దని అన్నివిధాలా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం అతిథిగృహంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. భైంసా పట్టణంలో చోటుచేసుకున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవనం స్తంభించడంతో నిరుపేదలు, సామాన్యులు, చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
వరుస ఘటన వల్ల భైంసాలో అభివృద్ధి కుంటుపడుతుందని, దీని ప్రభావం పరిసర ప్రాంతాలపైనా పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాజకీయాలకు అతీతంగా కృషిచేయాలని సూచించారు. కొన్ని పార్టీలు ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధకరమని, అల్లర్ల వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. భైంసా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, దీని వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. జర్నలిస్టులపై దాడి విచారకరమని.. దాడిని తీవ్రంగా ఖండించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ విష్ణు వారియర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు ఉన్నారు.