ప్రత్యేక బృందాల నియామకానికి ఆదేశాలు
కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, మే5: కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటికీ ఫీవర్ సర్వేను 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా పర్యవేక్షణకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గ్రామీణ ప్రాంతాల పర్యవేక్షణకు రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావును నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. మండల స్థాయిలో కొవిడ్ నియంత్రణ పర్యవేక్షణలో తాసిల్దార్లు కీలకపాత్ర వహించాలని, ఇందుకు ఎంపీడీవోలు, మండల వైద్యాధికారులు సహకరించాలని కోరారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి మూడ్రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేలో అంగన్వాడీ, ఆశ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనాలని సూచించారు. ప్రతి మండలంలో 3, 4 సూపర్వైజర్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సర్వేలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే కరోనా కిట్ అందించాలని, మామూలు లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉంటూ చికిత్స చేసుకునేలా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఆక్సిజన్ అవసరమైన వారిని మాత్రమే దవాఖానకు రెఫర్ చేయాలన్నారు. సర్వేలో జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. గురువారం నుంచి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఓపీని ప్రారంభించాలన్నారు. ప్రతి కేసుకు కరోనా పరీక్ష అవసరం లేదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం ఎదుట కొవిడ్కు సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు.
ఎవరికైనా లక్షణాలు ఎక్కువగా ఉంటే బాలానగర్, దేవరకద్ర, కోయిలకొండలలో ఏర్పాటు చేసిన మినీ కొవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలన్నారు. ప్రత్యేకాధికారులు, తాసిల్దార్లు, ఎంపీలు వారి పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను సబ్ సెంటర్లను పర్యవేక్షించాలన్నారు. కొవిడ్ సెంటర్లో పనిచేసే సిబ్బంది సెలవులు పెట్టొద్దన్నారు. వ్యాక్సిన్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఉన్న వైద్య కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలో ఉన్న అందరూ, వైద్య, పారా మెడికల్ సిబ్బంది కొవిడ్ విధులు నిర్వహించాలన్నారు. జిల్లా అధికారులు సైతం వారికి కేటాయించిన వార్డుల్లో పర్యటించి ప్రజలకు మేమున్నామనే ధైర్యం కల్పించాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో కొవిడ్ వచ్చిన ప్రాంతాల్లో డిస్ ఇన్ఫెక్షన్, ఎక్కువ కేసులు వచ్చిన చోట మినీ కంటైన్మెంట్ జోన్లు పెట్టాలని సూచరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శశికాంత్, డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్, సునీత, మండల ప్రత్యేకాధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.