మేయర్ వై సునీల్రావు ట్రాక్టర్లు ప్రారంభం
కార్పొరేషన్, ఏప్రిల్ 29: నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశారు. నగరంలో హరితహారం మొక్కలకు నీళ్లు పట్టేందుకు రూ. 65 లక్షలతో కొనుగోలు చేసిన 8 ట్రాక్టర్లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఈ వాహనాలను హరితహారం మొక్కలకు నీళ్లు పట్టడంతో పాటు ప్రజల అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు. ఇన్నిరోజులు మొక్కలకు నీళ్లు పట్టేందుకు అద్దె వాహనాలను వినియోగించినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు సరిగ్గా పని చేయకపోవడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. దీంతో పట్టణ ప్రగతి నిధులతో 8 ట్యాంకర్లను కొనుగోలు చేశామన్నారు. హరితహారం మొక్కలకు పూర్తిస్థాయిలో నీళ్లు పట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న మరో 7 ట్యాంకర్లకు కూడా మరమ్మతులు చేయిస్తామని వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలో 15 ట్యాంకర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయని, వీటిని ప్రజల అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణిహరిశంకర్, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, పుట్ట నరేందర్, మాజీ డిప్యూటీ మేయర్ షమీ, నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.