నల్లగొండ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి.
స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివారించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
హాలియాలో జరిగిన సాగర్ టీఆర్ఎస్ గర్జన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలు ఊహించనివి, ఆశించనివి సీఎం కేసీఆర్ చేశారని అన్నారు.
‘‘ ఏడేండ్ల పాలనలో ప్రజల ఎన్నో సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. గిరిజన గూడేలు, గోండు తండాలు, దళిత వాడలు, బస్తీల్లో.. ఎవరి మనసులో ఏ సమస్య ఉందో స్వయంగా తెలుసుకొని పరిష్కరించారు.
సంక్షేమ రంగంలో తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన వ్యక్తి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించని విధంగా దేశానికి అభివృద్ధి నమూనాను చూపిన నాయకుడు కేసీఆర్.
అద్భుత దార్శనికతతో నల్లగొండ జిల్లాలో ఆరేండ్లలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించారు. కరువు జిల్లా పేరున్న నల్లగొండకు నాడు 2 లక్షల ఆయకట్టు లేదు.
నేడు ఆయకట్టు బ్రహ్మాండంగా 10 నుంచి 12 లక్షలకు చేరింది. రాష్ట్రంలో అత్యధిక పంటలు పండే జిల్లాగా నల్లగొండను నిలిపారు.
ఓ పెద్ద మనిషిని తెచ్చుకుంటే ఏం జరిగింది.? ఇంకా సాగర్ నియోజకవర్గంలో 70 వేల ఎకరాలు ఎడారిగానే ఉంది.
పక్కనే నీళ్లుంటయ్ కానీ గొంతులు ఆరవు.. భూములు తడ్వవు’’ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ టీఆర్ఎస్ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ప్రజల అభీష్టం మేరకే సీఎం కేసీఆర్ హాలియా సభకు వచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి