91.59 శాతంతో రాష్ట్రంలోనే మంచిర్యాల ముందంజ
వివరాలు నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు
మంచిర్యాల, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకునేందుకు విద్యాశాఖ చేపట్టిన టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రుబ్రిక్స్ (టీఎస్ఏఆర్) డాటా నిర్ధారణలో రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయులు తమ పనితీరును తామే మదింపు చేసుకొని, రేటింగ్స్ ఇచ్చుకునే ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయనుండగా, టీసార్ వెబ్సైట్లో ఉపాధ్యాయులు నిర్ణీత అంశాలను ఇప్పటికే నమోదు చేశారు. ఎడిట్ ఆప్షన్తో మార్పులు చేర్పులకు ఈనెల 28వ తేదీ వరకు అవకాశమివ్వగా, వివరాలు నమోదు చేసి, నిర్ధారించుకున్న జిల్లాగా 91.59 శాతంతో రాష్ట్రంలోనే మంచిర్యాల ముందువరుసలో నిలిచింది.
రాష్ట్రంలోనే జిల్లా ప్రథమం..
ఉపాధ్యాయుల పనితీరుపై స్వీయ మదింపు చేసేందుకు టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రుబ్రిక్స్ (టీఎస్ఏఆర్) కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ (టీసార్)లో ఉపాధ్యాయులు నిర్ణీత అంశాలను పొందుపరిచారు. ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులు తమ విద్యార్హతలు, అకడమిక్ విద్యార్హత, బోధనలో తీసుకుంటున్న మెళకువలు, ఎలా బోధిస్తున్నారు.. వంటి విషయాలతో స్వీయ మదింపు చేశారు. మార్పులు, చేర్పులకు ఎడిట్ ఆప్షన్తో 28వ వరకు అవకాశమివ్వగా, వివరాలు నమోదు చేసుకొని, నిర్ధారణ చేసుకున్నారు. డాటా నమోదు చేసి, నిర్ధారణ చేసుకున్న జిల్లాల్లో 91.59 శాతంతో మంచిర్యాల ముందువరుసలో నిలిచింది.
జిల్లాలో 3,387 మంది ఉపాధ్యాయులుండగా, 3,135 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నమోదు చేసుకున్న వివరాలను 3,102 మంది ఉపాధ్యాయులు నిర్ధారణ చేసుకొని 91.59 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. టీచర్లు తమను తాము మదింపు చేసుకుని, పనితీరును మెరుగు పరుచుకునేందుకు టీసార్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. టీచర్లు తమ పనితీరుకు తామే రేటింగ్స్ ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఉపాధ్యాయులు అంతర్మథనం చేసుకోవడానికి, గుణాత్మక విద్యనందించేందుకు, బలాలు, బలహీనతలు, పొరపాట్లను గుర్తించేందుకు, వృత్తి పరమైన సవాళ్లను అధిగమించేందుకు ఇది దోహదపడుతుంది.