ఆదిలాబాద్, ఏప్రిల్ 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ సెకండ్ వేవ్(రెండో ఉధృతి) విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా మంది సొంత వైద్యానికే మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చూసి యథేచ్ఛగా మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడుతు న్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి రక్షించుకునే అవకాశం ఉన్నా.. భయంతో ఇష్టానుసారంగా గోలీలు వాడుతున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని, అవసరం లేని మందులు వేసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, భవిష్యత్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తు న్నారు. మందుల దుకాణాల్లో కూడా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటిబయాటిక్స్తో పాటు ఇతర మందులు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, టీకాలు, మెరుగైన చికిత్స అందిస్తున్నదని మందులు కూడా పంపిణీ చేస్తున్నదని, వైద్యశాఖ అధికారులు తెలుపుతున్నారు.
జిల్లాలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు పాజిటివ్ కేసులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఐసొలేషన్ కేంద్రాలతో పాటు హోం ఐసోలేషన్లో ఉన్న వారికి అవసమైన మందులు సరఫరా చేస్తున్నారు. తమకు కరోనా సోకుతుందనే భయంతో కొందరు మెడికల్ దుకాణాలకు వెళ్లి ఇష్టానుసారంగా మందులు కొనుగోలు చేస్తున్నారు. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చూసి మందులు వాడుతున్నారు. అజిత్రోమైసన్, సిట్రోజన్, పారాసిటమల్, జింక్, విటమిన్ సీ, మల్టీ విటమిన్, పెయిన్ కిల్లర్స్ వంటి వాటిని వినియోగిస్తున్నారు. కొందరు భయంతో సొంత వైద్యానికి దిగుతుండగా, మరికొందరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కొవిడ్ మందులను వినియోగిస్తున్నారు.
అవసరం లేని ముందులతో అనారోగ్యం
కరోనా భయంతో ప్రజలు అవసరం లేకున్నా మం దులు వాడితే అనారోగ్యం బారిన పడుతారని వైద్యు లు అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు నమ్మవద్దని, సొంత వైద్యం ఏ మాత్రం మంచిదికాదని సూచిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని, వారి సలహాలు, సూచనల మేరకు మాత్రమే మందులు వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అవసరం లేకున్నా మందులు వాడడంతో శరీరానికి రెసిస్టెన్స్ వస్తుందని, భవిష్యత్లో మందులు పనిచేయవని చెబుతున్నారు.సొంత వైద్యం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. వివిధ రకాల మందుల వినియోగంతో బీపీ పడిపోవడం, ఎలర్జీలు రావడం, కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు, కిడ్నీ, గుండె, లివర్ లాంటి అవయవాలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉం దని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు చేయడంతో పాటు వైద్యసేవలు అందిస్తుందని, సర్కార్ దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులు వాడాలని కోరుతున్నారు.
ఇష్టానుసారంగా విక్రయాలు
వైద్యుల మందుల చీటి లేకుండా మెడికల్ దుకాణాల్లో పలు రకాల ముందులు విక్రయించరాదు. కొవిడ్ నేపథ్యంలో ఏడాదిగా ప్రైవేట్ మందులు దుకాణాల్లో పలు ఔషధాలు విక్రయిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఓ మెడికల్ దుకాణంలో కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ను వైద్యశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాంటిబయాటిక్స్తో పాటు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, ఎలర్జీ, మల్టీ విటమిన్లు, జింక్, సీ విటమిన్ ట్యాబెట్లు విక్రయిస్తున్నారు. మందుల కొరత ఉన్నాయంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
వైద్యులను సంప్రదించాలి
కరోనాకు భయపడి ప్రజలు సొంత వైద్యం తీసుకోరాదు. ప్రభుత్వం జిల్లాలో 29 కేంద్రాలతో పాటు రెండు మొబైల్ వాహనాల ద్వారా ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నది. అనుమానితులతో పాటు ఇతరులు ఈ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవచ్చు. పాజిటివ్ వచ్చిన వారికి సైతం ఉచితంగా కరోనా మందులు పంపిణీ చేస్తాం. కరోనా వస్తుందనే భయంతో సెల్ఫ్ ట్రీట్మెంట్ అసలు వద్దు. ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే వైద్యులను సంప్రదించాలి. వారు అన్ని పరీక్షలు చేసి వ్యాధులను నిర్ధారించి ఎలాంటి మందులు వాడాలో సూచిస్తారు. అవసరం లేకుండా మందులు కొనుగోలు చేసి వేసుకుంటే భవిష్యత్ తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.