భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించిన ‘ఆక్సికేర్ వ్యవస్థ'(‘Oxycare’ system)ను కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలిపింది. రూ.322.5కోట్ల వ్యయంతో 1,50,000 యూనిట్ల ఆక్సికేర్ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. SpO2 ఆధారిత ఆక్సిజన్ సరఫరా వ్యవస్థనే ఆక్సికేర్ సిస్టమ్ అని డీఆర్డీవో పేర్కొంది. SpO2 స్థాయిల ఆధారంగా రోగులకు ఆక్సిజన్ను సరఫరా చేయడాన్ని ఈ వ్యవస్థ నియంత్రిస్తుంది.
ఆక్సికేర్ సిస్టం… మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆక్సిజన్ను అందజేస్తుంది. రోగికి అవసరమైన ఆక్సిజన్ను అతని శరీరంలోని SpO2 లెవల్స్ ఆధారంగా సరఫరా చేయడం దీని ప్రత్యేకత. ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్ వృథాను అరికట్టడంలో సహాయపడుతుంది. హెల్త్కేర్ ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గిస్తుంది.
ఈ సిస్టమ్ ద్వారా ఆక్సిజన్ సర్క్యులేషన్ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం కూడా లేదు. సాధారణ మెడికిల్ ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ సరఫరాను మాన్యువల్గా నియంత్రించాల్సి ఉంటుంది. సరికొత్త ఆక్సికేర్ సిస్టమ్ ద్వారా పేషెంట్లోని SpO2 స్థాయిలను పర్యవేక్షిస్తూ ఆక్సిజన్ను నియంత్రిస్తుంది.