నాడు వానకాలం వచ్చిందంటే గుబులు
నేడు ‘రైతు బంధు’తో ధీమా
అదునులోనే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు
ఆనందంలో అన్నదాతలు
కరీంనగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : 2014 ముందు.. వానకాలం రాకముందే రైతులకు రందీ వట్టేది. పెట్టుబడులు ఎలా తెచ్చేదని ఆందోళన చెందేది. బ్యాంకులకు వెళ్తే సవాలక్ష కొర్రీలతో రుణం దొరికేది కాదు. దొరికినా ఏ మూలకూ సరిపోయేది కాదు. తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల వద్దకు పోవాల్సి వచ్చేది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునేది. లేదంటే షాపుల్లో విత్తనాలు, ఎరువులు ఉద్దెర తెచ్చేది. అన్ని తెచ్చి సాగు చేసినా ఒక్కోసారి ఫలితం దక్కకపోయేది. ప్రతికూల పరిస్థితుల్లో పంట చేతికి వచ్చేది కాదు. వడ్డీకి పావుశేరు లెక్కన వచ్చిన పంటను అమ్మితే అసలు, మిత్తీ పోను చివరకు మళ్లీ అప్పులే మిగిలేది. ఒక్కోసారి రైతులకు ఆత్మహత్యే శరణ్యమయ్యేది..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉండేది. ప్రధానంగా పంటల సీజన్లలో పెట్టుబడుల కోసం తండ్లాడాల్సి వచ్చేది. ఏటా వానకాలం విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం చేతిల పైసలు లేక అరిగోస పడాల్సి వచ్చేది. బ్యాంకులను ఆశ్రయించినా పెద్దగా ఫలితముండకపోయేది. సవాలక్ష కొర్రీలతో ఎంతో మందికి రుణం అందేది కాదు. అందినా ఆశించినంత దొరకపోయేది. బ్యాంకు రుణాలు దొరకని పక్షంలో వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. బంగారం, పట్టాపాసు పుస్తకాలు, ఇతర వస్తువులు తనాఖా పెట్టి అధిక మిత్తీలకు అప్పు తెచ్చుకునేది. ఒక్కోసారి పుస్తెల్తాళ్లు పెట్టి మరీ తెచ్చుకున్న సందర్భాలు కూడా కనిపించేవి. ఎలాగోల అప్పు పుట్టిన తర్వాత ఎన్నో ఆశలతో సాగును ప్రారంభించేవాళ్లు. తీరా కరెంట్ లేకో, నీళ్లు లేకో లేదంటే గాలివానతోనో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి పంటలు నష్టపోయేది. వచ్చిన దిగుబడిని వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇటు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి అసలు కంటే అధికమయ్యేవి. అప్పులు చెల్లించ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. బ్యాంకుల్లో తెచ్చిన రుణాలు సకాలంలో చెల్లించే పరిస్థితి ఉండేది కాదు. ఒక సారి తీసుకున్న రుణం చెల్లించకపోతే రెండో సారి బ్యాంకులు నిరాకరించేవి. ఇక సహకార బ్యాంకుల పరిస్థితి మరోలా ఉండేది. రైతులు తీసుకున్న రుణాలను చెల్లించకపోతే ఆస్తులు వేలం వేసే పరిస్థితులు గ్రామాల్లో కోకొల్లలుగా కనిపించేవి. ఎంతో మంది రైతులు అవమానాలపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. సీజన్ ప్రారంభంలో ఏనాడు బ్యాంకులు రైతులకు సకాలంలో రుణాలు ఇచ్చిన సందర్భాలు ఉండేవి కావు. సీజన్ ప్రారంభమైన పక్షం, నెలకో అంతంత మాత్రంగా రుణాలు అందేవి. పంట రుణ పరిమితి ఖరారు చేసినా దీనిని ఏ బ్యాంకు పట్టించుకునేది కాదు.
రైతుబంధుతో దూరమైన బాధలు..
వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు పడుతున్న కష్టాలను ఉద్యమ నాయకుడిగా ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం. 2018 వానకాలం సీజన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట ఎకరానికి 4 వేల చొప్పున అందించారు. తర్వాత పెట్టుబడి సరిపోవడం లేదని ఆ తర్వాత 5 వేలకు పెంచారు. రెండు సీజన్లకు 10 వేలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో రైతులపై ఆర్థిక భారం తగ్గింది. సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందుతున్నది. దాంతో రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. దుక్కులు దున్నే ఖర్చులు కూడా వీటి నుంచే చెల్లిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో బ్యాంకుల చుట్టు తిరిగే రైతుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
రైతుబంధుతో పంటలు విత్తుకున్న తర్వాత అవసరమయ్యే పెట్టుబడి కోసం తీరిగ్గా బ్యాంకు రుణాలకు ప్రయత్నిస్తున్నారు. గతంలో రైతులను జలగల్లా పీల్చుకు తిన్న వడ్డీ వ్యాపారులు ఇప్పుడు గ్రామాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. గతేడాది నుంచి కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యానికి గురి చేసినా రాష్ట్రంలో రైతుబంధు పథకాన్ని మాత్రం ప్రభుత్వం ఆపడం లేదు. గతేడాది వాన కాలం, యాసంగితోపాటు ఈ యేడాది వానకాలం సీజన్కు ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులో కూడా రైతుల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. వడ్డీ రాయితీ పొందాలనే లక్ష్యంతో సకాలంలో రుణాలు చెల్లించి తిరిగి కొత్త రుణాలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా బ్యాంకులు బుక్ అడ్జెస్ట్మెంట్కు పాల్పడడం లేదు. రైతులకు చెల్లించే రుణాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పాటించని కొన్ని బ్యాంకులు ఇప్పుడు అనివార్యంగా అమలు చేస్తున్నాయి.
కరీంనగర్లో ఒక్కరోజులో 16.84 కోట్లు..
వానకాలం సీజన్కు సంబంధించి సర్కారు మంగళవారం నుంచి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. మొదటి ఒక్క రోజులోనే 59,780 మంది రైతులకు 16కోట్ల 84లక్షల 33వేల 820 పెట్టుబడి సహాయం అందించినట్లు డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. ఈ సీజన్కు జిల్లాలో మొత్తం 1,80,878 మంది రైతులు అర్హులుగా ఉండగా ఈ రోజు వరకు 1,02,485 మంది రైతులకు వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులు ట్రెజరీకి పంపించారు. ఈ మొత్తం రైతులకు 48కోట్ల 66లక్షల 81వేల 198 నగదు చెల్లించాల్సి ఉంది. కాగా రెవెన్యూ శాఖ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు వెంటనే తమ బ్యాంకు వివరాలను తమ వ్యవసాయ అధికారులకు అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ కోరారు.
జగిత్యాలలో 20.16 కోట్లు
జిల్లాలోని 18 మండలాలకు చెందిన 2,15,019 మంది రైతులకు గానూ తొలిరోజు రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 74,901 మంది రైతుల ఖాతాల్లో రూ. 20,16,86,645 నిధులు జమ చేసింది. మిగితా రైతులకు దఫాల వారీగా వారి ఖాతాల్లో రైతు బంధు సాయం జమ చేయనుంది.
మిగతా జిల్లాల్లో..
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 1,17,577 మంది రైతులు ఉండగా, వీరికి రైతుబంధు కింద 129.21కోట్లు అందించనున్నది. పెద్దపల్లి జిల్లాలో 1,39,554 మంది రైతులకు 137.42 కోట్లు అందించాల్సి ఉండగా, మంగళవారం 45,448 మందికి 13.75కోట్లు సర్కారు జమ చేసింది.