ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అత్యాధునికమైన ఫీచర్లతో లాంచ్ అయిన ఈ బైక్ త్వరలోనే వినియోగదారులకు స్కూటర్లను డెలివరీ చేయనుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేశారు. అదే రోజు సింపుల్ వన్ అనే మరో ఎలక్ట్రిక్ బైక్ కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు.
ఈనేపథ్యంలో ఓలా రెండు ఎలక్ట్రిక్ బైక్స్ను లాంచ్ చేసింది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో పేర్లతో లాంచ్ చేసిన ఈ బైక్స్ ధరలను కూడా వెల్లడించింది. ఓలా ఎస్1 బైక్ ధర రూ.99,999 కాగా.. ఎస్1 ప్రో ధర 1,29,999గా ఫిక్స్ చేశారు.
సెప్టెంబర్ 8 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. అక్టోబర్లో దేశవ్యాప్తంగా 1000 నగరాల్లో స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 8 వరకు ప్రీ బుకింగ్ను నిర్వహిస్తామని.. దాని కోసం రూ.499 పే చేసి ప్రీబుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
అయితే.. ఈఎంఐ పద్ధతిలో కూడా ఓలా ఎలక్ట్రిక్ బైక్ను అందించనున్నారు. దాని కోసం ఓలా కంపెనీ పలు బ్యాంకులతో టైఅప్ అయింది. కేవలం నెలకు రూ.2999 ఈఎంఐ కడుతూ.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ను సొంతం చేసుకోవచ్చు.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా క్యాపిటల్, యెస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ లాంటి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఓలా బైక్ మీద ఈఎంఐ ఫెసిలిటీని అందిస్తున్నాయి.