ఢిల్లీ, జూలై :భారతదేశంలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా , వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందుకు అంబంధించిన తుది ముసాయిదాకు న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపింది. ఈ ముసాయిదా దానిని చట్టంగా రూపొందించడం జరుగుతుంది.
వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్లేట్లను కేటాయించేందుకు కొత్త రూల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రతిపాదిత విధానం వల్ల వింటేజ్ కార్ల యజమానులకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. పురాతన వాహనాల యజమానులు ఈ కార్లను స్క్రాపేజ్ విధానం నుంచి మినహాయించాలని చేసిన డిమాండ్స్ ఫలించాయి.
మనదేశంలో 50 ఏండ్లు పైబడిన కార్లను మాత్రమే పాత వాహనాలుగా (వింటేజ్ వెహికల్స్)గా పరిగణిస్తారు. కొత్త విధానం ప్రకారం, ఇలాంటి పురాతన వాహనాలను రోడ్లపై ఇతర కార్ల మాదిరిగా ఉపయోగించలేరు. ఈ కొత్త నిబంధనలు, పాతకాలపు కారు యజమానులకు తమ ప్రత్యేక వాహనాలను ప్రత్యేకమైన సందర్భాలలో లేదా ప్రత్యేకమైన సమయంలో మాత్రమే బయటకు తీసుకురావడానికి అనుమతిస్తాయి. అంతేకాదు ఈ కొత్త నిబంధనల ప్రకారం వింటేజ్ కార్లను కమర్షియల్ వెహికల్స్ గా ఉపయోగించ లేరు.
ఇకపై వింటేజ్ కార్ల యూజమానులు నిబంధనలు అతిక్రమిస్తే, సదరు కారు యజమానిపై ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు తీసుకుంటుంది. అన్ని వింటేజ్ కార్లకు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ ప్లేట్ల లా కాకుండా ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉన్నది. ఈ రూల్స్ చట్టంగా మారిన తర్వాత అధికారులు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించనున్నారు.
యజమాని తన వాహనానికి చెందిన పాత సంఖ్యను ఇప్పటికే రిజిస్టర్ చేస్తే అదే ఉంటుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ కారును రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకుంటే వారి వింటేజ్ వెహికల్ కు స్పెషల్ సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. వింటేజ్ వాహనాలను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి రూ.20,000 ఫీజు వసూలు చేయనున్నారు. రీ-రిజిస్ట్రేషన్ కోసం రూ.5,000 ఖర్చు అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ 10 ఏండ్ల వరకూ చెల్లుబాటు అవుతుంది.