వాషింగ్టన్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. తన అంతరిక్ష శిథిలాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని విమర్శించింది. చైనా అతిపెద్ద రాకెట్ అయిన లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి ఆదివారం ఉదయం హిందూ మహాసముద్రంలో కూలిపోయిన కొద్ది గంటల తర్వాత నాసా దీనిపై స్పందించింది. నాసా అడ్మినిస్ట్రేలర్ బిల్ నెల్సన్ చైనా స్పేస్ ప్రోగ్రామ్ను దుయ్యబట్టారు. అంతరిక్షంపై కన్నేసిన దేశాలు వాళ్ల స్పేస్ ఆబ్జెక్ట్స్ తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు భూమిపై ఉన్న ప్రజలు, వాళ్ల ఆస్తులకు ముప్పు కలగకుండా చూడాలి. ఈ ఆపరేషన్లలో పారదర్శకతను పెంచాలి అని నెల్సన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అంతరిక్ష కార్యకలాపాలను సుదీర్ఘ కాలం కొనసాగించడానికి, భద్రత, స్థిరత్వం కల్పించడానికి చైనా సహా అన్ని దేశాలు బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో ఫ్లోరిడా నుంచి సెనేటర్గా ఉన్న ఆస్ట్రోనాట్ నెల్సన్.. మార్చిలో నాసా అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలు చేపట్టారు. గత నెల 29న చైనా లాంచ్ చేసిన ఈ రాకెట్.. 100 అడుగుల పొడవు, 22 మెట్రిక్ టన్నుల బరువు ఉంది. ఇది నియంత్రణ కోల్పోవడంతో భూమిపై ఉన్న జనావాసాలపై ఎక్కడ కూలుతుందో అన్న ఆందోళన కలిగింది. చివరికి అదృష్టవశాత్తూ అది మాల్దీవ్స్కు చేరువలో హిందూ మహాసముద్రలో కూలింది.