సిద్దిపేట : వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా కష్ట కాలంలో దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బంది రావొద్దని, బాధ్యతగా పనిచేసి కొవిడ్ రోగులకు భరోసాను ఇవ్వాలని వైద్యాధికారులకు సూచించారు. బాధ్యతాయుతంగా పని చేయని వారిపై చర్యలు తప్పవని వైద్య అధికారులను మంత్రి హెచ్చరించారు.
సిద్దిపేట మెడికల్ కళాశాలలోని కొవిడ్ వార్డులో రోగులకు వసతుల కల్పనపై ఆదివారం ప్రభుత్వ దవాఖానను మంత్రి పరిశీలించారు. హాస్పిటల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ జయశ్రీ, మెడికల్ కళాశాల, ఏరియా దవాఖాన అధికారిక సిబ్బందితో మంత్రి సమీక్షించారు.
హాస్పిటల్ లో సిబ్బంది పనితీరుపై ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో వారు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దవాఖానకు అవసరమైన అడ్మినిస్ట్రేటివ్- వ్యవస్థపరమైన అంశాలపై గ్యాప్ ఉంటే ఏ రకమైన అవసరం ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు.
ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని, రోగికి మీ ఆత్మీయ పలకరింపే చాలా ముఖ్యమన్నారు. ఈ దవాఖాన మనందరిదని, అందరూ బాధ్యతాయుతంగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. పేషెంట్లను కుటుంబ సభ్యులు నేరుగా కలిసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు కాశీనాథ్, చందర్, క్రాంతి, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు సాయి, ప్రవీణ్, దీప్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం