భవిష్యత్తుపై మనిషికి ఉన్న అచంచలమైన ప్రేమే కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నది. నాగరికత పరిణామక్రమంలో అందుబాటులోకి వచ్చిన ఎన్నో ఆవిష్కరణలు మానవ జీవితాన్ని సుఖమయం చేయడంతో పాటూ ప్రకృతికి ప్రాణసంకటంగానూ పరిణమించాయి. ఖనిజ ఇంధనాలు, ఏసీ, రిఫ్రిజిరేటర్ల విచ్చలవిడి వినియోగంతో భూతాపం పెరిగి ధ్రువప్రాంతాల్లో మంచుకొండలు కరిగి సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న కొన్నేండ్లలో 50కి పైగా ద్వీప దేశాలు కడలి గర్భంలో కలిసిపోనున్నాయి. అందులో మాల్దీవులు ఒకటి. అయితే రానున్న ప్రమాదాన్ని ముందుచూపుతో ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. అదే.. ది ఇన్నోవేటివ్ ఫ్లోటింగ్ ఐలాండ్ సిటీ (అలలపై తేలియాడే వినూత్నమైన ద్వీప నగరం).
ఏమిటీ ఈ నగరం?
హిందూమహా సముద్రంలో ఓ చిన్న ద్వీప దేశం మాల్దీవులు. విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు. జనాభా ఐదున్నర లక్షలు. అయితే, భూతాపం వల్ల సముద్ర మట్టాలు పెరుగడంతో ఈ ద్వీపంలోని తీరప్రాంతం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతున్నది. ఇది ఇలాగే కొనసాగితే, ఇంకొన్ని రోజుల్లో ద్వీపమే కనుమరుగయ్యే ప్రమాదమున్నదని గమనించిన అక్కడి అధికారులు సముద్రంపై తేలియాడే ఓ నగరాన్ని నిర్మించాలని గత నెలలో నిర్ణయించారు. ఆ ప్రాజెక్టుకు ‘ఇన్నోవేటివ్ ఫ్లోటింగ్ ఐలాండ్ సిటీ’ అని పేరు పెట్టారు. భూమిలోపలికి సముద్రపు నీరు చొచ్చుకొచ్చి మడుగులుగా (లాగూన్స్) ఏర్పడిన ప్రదేశం మీద ఈ నగరాన్ని నిర్మించనున్నారు.
ఎప్పుడు నిర్మిస్తారు?
నెదర్లాండ్స్కు చెందిన ‘డచ్ డాక్లాండ్స్’ అనే సంస్థ ఈ ఫ్లోటింగ్ సిటీ డిజైన్ను ప్రతిపాదించింది. 200 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సిటీ పనుల్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. ఐదేండ్లలో ఈ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. వెనీస్ నగరంలోని ఇండ్ల మాదిరిగా అలలపై తేలియాడేలా ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. షడ్భుజాకారంలో ఒకదానికొకటి అనుసంధానిస్తూ ఇక్కడి ఇండ్లను నిర్మిస్తుండటంతో కెరటాలు ఉప్పెనలా విరుచుకుపడే ప్రమాదం ఉండదు. ప్రపంచంలో నిర్మిస్తున్న తొలి ఫ్లోటింగ్ సిటీ ఇదే.
నగరంలో ఏమేమి ఉంటాయి?
ఒక మెట్రో నగరానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ ఫ్లోటింగ్ సిటీని నిర్మిస్తున్నారు. ఈ నగరంలో ఇండ్లు, కార్యాలయాలు, దవాఖానలు, స్కూళ్లు, వాణిజ్యసముదాయాలతో పాటు వినోదం కోసం థియేటర్లు, పార్కులు ఇలా సర్వహంగులు ఉంటాయి. ఇక్కడి పర్యావరణం కలుషితం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నగరంలో కి కార్లను నిషేధించనున్నారు. సైకిళ్లు, శబ్దంచేయని ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే అనుమతించనున్నారు. ఈ నగరంలోని ఒక్కో ఇంటిని 2,50,000 డాలర్లకు (రూ.1.85 కోట్లు) విక్రయించనున్నారు.
ఇప్పుడే ఎందుకు?
మాల్దీవుల్లో 80% ప్రాంతం సముద్రమట్టానికి కేవలం ఒక మీటరు ఎత్తులోనే ఉన్నది. సముద్ర మట్టం కొంచం పెరిగినా ముందుగా ప్రభావితమయ్యేది ఈ దీవులే. దీన్నుంచి తప్పించుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భూతాపాన్ని తగ్గించాలి. దీనికి ప్రపంచం సమష్టిగా కృషి చేయాలి. అయితే, ఇందులో ఏ మాత్రం ఆలస్యం జరిగినా ముందుగా నష్టపోయేది మాల్దీవులే. అందుకే రెండో మార్గమైన ఫ్లోటింగ్ సిటీ నిర్మాణానికి అధికారులు కార్యోన్ముఖులయ్యారు.