మరో డంపింగ్యార్డు ఏర్పాటుకు ప్రతిపాదన
పటాన్చెరు డివిజన్ అభివృద్ధికి అండగా ఉంటాం
డివిజన్ 113 ఆకస్మిక పర్యటనలో మేయర్ గద్వాల విజయలక్ష్మి
పటాన్చెరు, ఏప్రిల్ 23 : పారిశుధ్యంపై రాజీపడమని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పటాన్చెరు డివిజన్ 113లో మేయర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్తో కలిసి పట్టణంలో సందర్శించారు. పట్టణ శివారులోని జీహెచ్ఎంసీ డంపింగ్యార్డును పరిశీలించారు. రోజుకు 80 ఆటో ట్రాలీల చెత్త ఈ డంపింగ్యార్డుకు వస్తున్నదని, ఏ రోజుకారోజు చెత్తను శుభ్రం చేసి ప్యాక్ చేస్తున్నామని సిబ్బంది మేయర్కు తెలుపడంతో పనితీరు బాగుందని ఆమె సిబ్బందిని అభినందించారు. మరో డంపింగ్యార్డు బండ్లగూడవైపు కావాలని కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ మేయర్ను కోరారు. వెంటనే మేయర్ స్పందించి తప్పకుండా మరో డంపింగ్యార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్పొరేటర్ పట్టణంలో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావాలని మేయర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
బండ్లగూడ గ్రామం డివిజన్ 113లో విలీనం అయ్యిందని, అప్పటి పారిశుధ్య సిబ్బందికి పాత జీతాలే ఇస్తున్నారని, జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు సమాన వేతనాలు ఇవ్వాలని మేయర్ను కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. పటాన్చెరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. రోడ్లపై చెత్తను చెత్త శుద్ధి కర్మాగారానికి తీసుకుని వస్తే సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ బాలయ్య, కార్పొరేటర్కు సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల సేవలు మెరుగ్గా అందజేస్తామన్నారు. అనంతరం వెజిటేబుల్ మార్కెట్ను మేయర్ పరిశీలించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్, ఎండీ ఆఫ్జల్, వంగరి అశోక్, ప్రమోద్గౌడ్, పి.శివారెడ్డి, ధన్రాజ్గౌడ్, సందీప్ గిరి ఉన్నారు.