న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆకాశంలో మరో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. ఆ మధ్య గురు, శని గ్రహాల గ్రేట్ కంజక్షన్ తర్వాత మళ్లీ ఇప్పుడు కుజ, శుక్ర గ్రహాలు దగ్గరగా వచ్చి చంద్రుడితో కలిసి కనిపించనున్నాయి. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈ ఖగోళ వింతను చూడొచ్చు. వీనస్, మార్స్ మూడుసార్లు దగ్గరగా రానుండగా అందులో ఇది మొదటి సందర్భమని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. మళ్లీ ఫిబ్రవరి 12, 2022.. మార్చి 12, 2022న కూడా ఈ రెండు గ్రహాలు ఇలా దగ్గరగా రానున్నాయి.
ఒకే వరుసలో కుజ, శుక్ర గ్రహాలు, చంద్రుడు
సోమవారం, మంగళవారం రెండు రోజులూ భూమి నుంచి చూస్తే కుజ, శుక్ర గ్రహాలు కేవలం 0.5 డిగ్రీల ఎడంతో మాత్రమే కనిపించనున్నాయి. సోమవారం ఈ రెండు గ్రహాలకు 4 డిగ్రీలలోపే చంద్రుడు కూడా రానున్నాడు. ఈ ఖగోళ వింతను నేరుగా కళ్లతోనే చూడొచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తెలిపింది. సోమ, మంగళవారాల్లో సాయంత్రం బయటకు వచ్చి చూస్తే ఇది కనిపిస్తుందని చెప్పింది. మంగళవారం తర్వాత మళ్లీ కుజ, శుక్ర గ్రహాలు దూరంగా వెళ్లిపోనున్నాయి. సాయంత్రం సూర్యాస్తమయం కాగానే.. ఆకాశం మేఘావృతం కాకపోతే ఇది స్పష్టంగా కనిపిస్తుంది.