బీజింగ్: అప్పుడెప్పుడో ఏడాదిన్నర కిందట వచ్చిన కరోనా వైరస్ మూలాలనే ఇప్పటి వరకూ కనిపెట్టలేకపోయారు. కానీ తాజాగా ఇలాంటి కరోనా వైరస్లే మరెన్నో గబ్బిల్లాల్లో ఉన్నట్లు చైనా పరిశోధకులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తూ లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కొవిడ్-19కు దగ్గరగా ఉన్న రైనోలోఫస్ పుసిల్లస్ అనే వైరస్ కూడా ఇందులో ఉంది. ఈ పరిశోధనలు కేవలం చైనాలోని ఓ చిన్న ప్రావిన్స్ అయిన యునాన్కు సంబంధించినవే.
ఆ లెక్కన మిగతా ప్రాంతాల్లోని గబ్బిలాల్లో ఏ స్థాయిలో ఈ కొత్త కొత్త కరోనా వైరస్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ గబ్బిలాలు మనుషులతోపాటు పందులు, ఎలుకలు, పశువులు, పిల్లులు, కుక్కలు, కోళ్లకు కూడా వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుందని చైనా పరిశోధకలు అంటున్నారు. 2019 చివర్లో SARS-CoV-2 అనే ఓ కొత్త కరోనా వైరస్ను కనుగొన్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్లో కనిపించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
తాజా పరిశోధన ఏంటి?
తమ తాజా పరిశోధనలో భాగంగా పరిశోధకులు గబ్బిలాలకు చెందిన 283 మలం నమూనాలు, 109 నోటి స్వాబ్లు, 19 మూత్ర నమూనాలు సేకరించారు. 2019 మే నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో వీటిని సేకరించి పరిశోధనలు జరిపారు. వీటి ఫలితాలను సెల్ అనే జర్నల్లో ప్రచురించారు. షాడాంగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఫలితాల గురించి చెబుతూ.. వివిధ గబ్బిలాల జాతుల నుంచి మొత్తం 24 కొత్త కరోనా వైరస్ జీనోమ్లను గుర్తించినట్లు చెప్పారు.
ఇందులోని ఒకటి మాత్రం ప్రస్తుత కరోనా వైరస్కు చాలా దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. స్పైక్ ప్రొటీన్లో చిన్న మార్పులు తప్ప.. మిగతాదంతా ఇప్పుడు SARS-CoV-2లాగే ఉన్నదని ఆ పరిశోధకులు చెప్పారు. థాయ్లాండ్లోనూ గతేడాది జూన్లో గబ్బిలాల్లో ఇలాంటి వైరస్ను గుర్తించారు. ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఉన్న గబ్బిలాల్లో కరోనాలాంటి వైరస్లు భారీగా సర్క్యులేట్ అవుతున్నట్లు వాళ్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో ఇవి ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత కరోనా వైరస్కు మూలం కూడా గబ్బిలాలే అని భావిస్తున్నా.. అది మధ్యలో ఓ జంతువుకు సోకి, తర్వాత మనుషులకు సోకినట్లు చెబుతున్నారు.