నారాయణపేట టౌన్, ఏప్రిల్ 2: యాసంగిలో వరి కొనుగోళ్ల కోసం జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
లక్ష మెట్రిక్ టన్నుల అంచనా
జిల్లా వ్యాప్తంగా గత యాసంగి కన్న ఈ సారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 45,802 మంది రైతులు 96,801 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. 2019-20 యాసంగిలో జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 106 కొనుగోలు కేంద్రాల ద్వారా 50,563 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. వానాకాలం పంటలో జిల్లా వ్యాప్తంగా 56కేంద్రాలను ఏర్పాటు చేయగా 73,732 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించారు. అయితే వర్షాలు పుష్కలంగా కురువడం, భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో ఉండడంతో ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగింది. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తారని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 17శాతంలోపు తేమ ఉండేలా రైతులు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రేడ్ 1 రకం ధాన్యానికి రూ.1,888 మద్దతు ధర, కామన్ రకానికి రూ.1,868 మద్దతు ధర చెల్లించనున్నారు.
112 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 20 నుంచి 25రోజుల్లో వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ, మెప్మా, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్లో 106 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ యాసంగిలో 112 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 24లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 9లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటిని తెప్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా..
రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, కేంద్రాల నిర్వాహకులు విధిగా టీకా తీసుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మాట్లాడారు. కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతామని అధికారులు అన్నారు. నిర్వాహకులు, రైతులు మాస్కులు ధరించేలా, శానిటైజర్ అందుబాటులో ఉంచుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడతామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు.
సంతోషకరమైన విషయం
ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కేంద్రాలను ఏర్పాట్లు చేయాలి.
ఇవి కూడా చుడండి
బీటెక్లో లేకున్నా ఎంటెక్లో చదవొచ్చు