చార్మినార్, మే 6 : మారు తాళం చెవితో బంధువుల ఇంటికే కన్నం పెట్టిన సంఘటన చాంద్రాయణ గుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గురువారం డీసీపీ కార్యాలయంలో డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్ సాధిఖ్కు తాళ్లకుంట ప్రాంతానికి చెందిన అబ్దుల్ అజీం (32) సమీప బంధువు. కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అబ్దుల్ సాధిఖ్ ఇంటికి తరుచుగా వెళ్తూ.. వారి కుటుంబ సభ్యుల్లో ఒకడిగా కలిసిపోయాడు. ఈ క్రమంలో అబ్దుల్ అజీం కన్ను సాధిఖ్ ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుపై పడింది. ఎలాగైనా వాటిని చోరీ చేయాలన్న ఉద్దేశంతో అల్మారకు చెందిన మారు తాళం చెవి చేపించుకుని అదునుకోసం ఎదురుచూస్తున్నాడు.
సాధిఖ్ కుటుంబ సభ్యులు బంధువులను కలిసేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లగా.. అజీం తన స్నేహితుడై మజర్ అల్ ఆమూదీ (29)తో కలిసి చోరీకి పాల్పడ్డాడు. 18 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలను దొంగిలించారు. అబ్దుల్ సాధిఖ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు సాంకేతిక ఆధారాలతో అజీం, ఆమూదీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 16 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.17 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రఫీక్, ఫలక్నుమా ఏసీపీ మాజీద్తోపాటు ఇన్స్పెక్టర్ రుద్రభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.