న్యూఢిల్లీ, మార్చి 29: కృష్ణబిలాల నుంచి వెలువడే గురుత్వాకర్షణ తరంగాలను కనిపెట్టేందుకు అంతర్జాతీయంగా ఐపీటీఏ పేరుతో జరుగుతున్న పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు భాగస్వాములు కానున్నారు. దేశంలోని 15 సంస్థలకు చెందిన 25 మంది పరిశోధక విద్యార్థులు ఇప్పటికే ఇండియన్ పల్సర్ టైమింగ్ అర్రే పేరుతో పుణెలోని uGMRT రేడియో టెలిస్కోపుతో పరిశోధనలు చేస్తున్నారు. ప్రత్యేకమైన పౌనఃపున్యాన్ని గుర్తించగల దీని సామర్థ్యం ఇప్పుడు అంతర్జాతీయ పరిశోధనల్లో ఉపయోగపడనున్నది. ఐఐటీ హైదరాబాద్కు చెందిన శంతను దేశాయ్(అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజిక్స్), రాఘవ్ గిర్గావంకర్(బీటెక్ విద్యార్థి, ఇంజినీరింగ్ ఫిజిక్స్), అశ్విన్ పాండే(బీటెక్ విద్యార్థి, మెకానికల్ ఇంజనీరింగ్) ఇప్పటికే ఈ పరిశోధనల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ InPTA ఇటీవల అధికారికంగా IPTAలో శాశ్వత భాగస్వామి అయింది. దీంతో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు అంతర్జాతీయంగా పరిశోధనలు నిర్వహించడానికి తలుపులు తెరిచినట్టయింది. అంతర్జాతీయంగా బ్లాక్ హోల్స్పై జరుగుతున్న పరిశోధనలకు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపును వినియోగిస్తున్నారు.