న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ కోర్టు ఒక రోజు మినహాయింపు ఇచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై వీరిద్దరిపై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ చార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న కోర్టుకు హాజరుకావాలంటూ మార్చి 24న వారిద్దరికి సమన్లు జారీ చేసింది.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వ్యక్తిగత హాజరు నుంచి కోర్టును మినహాయింపు కోరారు. న్యాయవాది అర్ష్దీప్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బుధవారం విచారణ జరిపారు. వ్యక్తిగత హాజరు నుంచి ఒక్క రోజుకు మినహాయింపు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
రూ.305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో 2019 ఆగస్ట్ 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ అదే ఏడాది అక్టోబర్ 16న ఆయనను అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో అక్టోబర్ 22న, ఈడీ కేసులో డిసెంబర్ 4న చిదంబరానికి బెయిల్ లభించింది.
మరోవైపు ఇదే కేసులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని 2018 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేయగా మార్చిలో బెయిల్ పొందారు. ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.