ప్రస్తుతం భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సెంచరీ ఎప్పుడో దాటేశాయి. ధరలు తగ్గడం పక్కన పెడితే రోజు రోజుకూ పెరుగుతూ వెళ్తున్నాయి. ఎప్పుడో.. నెల, రెండు నెలలకు ఒకసారి.. పావలా, లేదా అర్ధ రూపాయి తగ్గితే.. వాహనదారుడికి ఏం ఊరట లభిస్తుంది. ఈరోజుల్లో వాహనాలను బయటికి తీయాలంటేనే జనాలు జంకుతున్నారు. వామ్మో.. అనిపెట్రోల్, డీజిల్ ధరలను చూసి హడలిపోతున్నారు.
అందుకే.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. ఇదే అదునుగా భావించి.. పలు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు.. ఎలక్ట్రిక్ బైక్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు కూడా ఇప్పటికే ఇండియాలో రిలీజ్ అయ్యాయి. టాటా నుంచి నెక్సస్ ఈవీ కారు వచ్చింది. అలాగే.. మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. చాలా కార్ల కంపెనీలు.. ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
తాజాగా.. ఓలా అనే ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓలా ఎస్1, ఎస్1 ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత విపణిలోకి తీసుకొచ్చాయి. ఆగస్టు 15నే ఓలా తన స్కూటర్లను లాంచ్ చేసింది. అదే రోజు సింపుల్ వన్ అనే మరో ఈ బైక్ కూడా ఇండియాలో లాంచ్ అయింది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
ఓకే.. పర్యావరణ పరిరక్షణ కోసమో లేక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనో.. ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నాం అనుకోండి.. మరి.. ఆ బండి సర్వీసింగ్ ఎక్కడ చేయించాలి? ఏదైనా రిపేర్ వస్తే ఎలా? ఎక్కడ రిపేర్ చేయించాలి? అన్ని ప్రాంతాల్లో సర్వీసింగ్, రిపేరింగ్ అందుబాటులో ఉంటుందా? లాంటి సవాలక్ష ప్రశ్నలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. వాటికి సమాధానమే ఈ కథనం.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అయ్యాక.. Ola Electric అనే యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారానే స్కూటర్కు సంబంధించిన అన్ని పనులు జరిగేది. ఆ యాప్లో Ola Champion అనే ఫీచర్ ద్వారా స్కూటర్ సర్వీసింగ్ డిటెయిట్స్ తెలుసుకోవచ్చు. ఓలా చాంపియన్ ఫీచర్లో సర్వీసింగ్కు సంబంధించిన రిక్వెస్ట్ పెట్టగానే.. ఓలా టెక్నిషియన్ ఇంటికే వచ్చి దాని సర్వీసింగ్ పూర్తి చేస్తారు. అలాగే.. ఓలా స్కూటర్కు సంబంధించిన సర్వీసింగ్ అలర్ట్స్ కానీ.. రిపేర్ చేయాల్సి వస్తే దాని అలర్ట్స్ కానీ.. ఫోన్ యాప్కు వస్తాయి. దాన్ని బట్టి.. ఓలా చాంపియన్ ఫీచర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే.. టెక్నిషియన్లు ఇంటికే వచ్చి.. స్కూటర్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా అక్కడే రిపేర్ చేస్తారు. సో.. స్కూటర్ను ఏ బైక్ సర్వీసింగ్ సెంటర్కు గానీ.. రిపేర్ సెంటర్కు గానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటికే టెక్నిషియన్లు వస్తారు. దాని కోసం ఓలా.. ప్రెడిక్టివ్ ఏఐ మెయిన్టెనెన్స్ను ఉపయోగిస్తోంది.
అయితే.. త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్.. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఓలా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అక్కడ కూడా ఓలా స్కూటర్లను అమ్మకానికి పెట్టనుంది. వచ్చే మూడు నెలలలో ప్రతి సిటీలో ఓలా సెంటర్ల ఏర్పాటుకు ఓలా సన్నాహాలు చేస్తోంది.