డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. హరిద్వార్లో ఇటీవల ముగిసిన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి 91 లక్షల మంది భక్తులు హాజరై గంగానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు. మరోవైపు కుంభమేళా ఆరంభం నుంచి ఆ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండగా ముసిగిన నాటికి తీవ్రస్థాయికి చేరింది. దీంతో కరోనా రోగులతో ఆసుపత్రులు కిటకిటాడుతున్నాయి. ఆక్సిజన్కు కొరత ఏర్పడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ గుజరాత్ రాష్ట్రం సహాయాన్ని కోరారు. సీఎం విజయ్ రూపానీకి ఫోన్ చేసి ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కోరారు. స్పందించిన గుజరాత్ సీఎం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
మరోవైపు ఉత్తరాఖండ్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తదుపరి ఆదేశాల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను మూసివేస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని ఉన్నత విద్య జాయింట్ సెక్రటరీ పేర్కొన్నారు.