పేదల సొంతింటి కల సాకారమే కేసీఆర్ లక్ష్యం
ఎమ్మెల్యే రెడ్యానాయక్
ఉగ్గంపల్లిలో వంద ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
చిన్నగూడూరు, జూన్ 25 : పేదప్రజల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అర్హులందరికీ మంజూ రు చేస్తామని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తన స్వగ్రామమైన ఉగ్గంపల్లిలో వంద డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీమాంధ్రుల పాలనలో అరిగోస పడిన తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించినట్లు తెలిపారు. దీంతో ప్రతి చెరువు, కుంట జలకళను సంతరించుకుని సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఏటా రెండు పంటలు పండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని, లేకపోతే తెలంగాణ ఎడారిగా మారేదన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
ఇప్పటికే మండలంలోని పూర్వపు జయ్యారం పంచాయతి పరిధిలో 210, గుండంరాజుపల్లిలో 50, విస్సంపల్లిలో 50 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ రైస్మిల్లర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు ధరంసోత్ రవిచంద్ర, జడ్పీటీసీ మూల సునీత, మైనార్టీ జిల్లా నాయకుడు ఆయూబ్పాషా, వైస్ ఎంపీపీ వీరన్న, సర్పంచ్లు పూలమ్మ, మల్లయ్య, ఎంపీటీసీ ఉదయమ్మ, మండల నాయకుడు రాంసింగ్, యువజన నాయకుడు వల్లూరి చెన్నారెడ్డి, కోఆప్షన్సభ్యులు మూసిన్భేగ్, నాయకులు కొమురెల్లి, మల్లేశ్, గంగరాజు, మురళి, సురేశ్ పాల్గొన్నారు.