కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 26: భూసేకరణ కోసం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ సూచించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ -5 భూసేకరణ కోసం చేపట్టనున్న ప్రజాభిప్రాయాల కార్యక్రమాల నిర్వహణపై సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుంపులుగా ఉండకుండా 2 లేదా 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ న బుధవారం సుందిళ్ల, ముస్త్యాల, 29వ తేదీన గురువారం గోదావరిఖనిలోని విఠల్ నగర్ , జనగామలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. ఒక వేళ ఎక్కువ మంది వస్తే 30వ తేదీ శుక్రవారం కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆదేశించారు. 100 మందిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించేలా ముందస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధల ప్రకారం కుర్చీలు వేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి వ్యక్తిని థర్మల్ స్కానర్ ద్వారా చెక్ చేసి అనుమతించాలన్నారు. పారిశుధ్య కార్మికుల చేత సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి డీఆర్వో, ఎస్డీసీ, మంథని ఆర్డీవో కే నరసింహమూర్తి, పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఆర్జీ -1 జీఎం నారాయణ, రామగుండం, రామగిరి తహసీల్దార్లు రమేశ్, పుష్పలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.