హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి వాటిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. మీ సేవ, హాక్ ఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఫోన్లు రికవరీ చేసిన అనంతరం వెంటనే బాధితులకు సమాచారం ఇస్తామన్నారు. ధ్రువీకరణపత్రాలు కోల్పోతే మీ సేవలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇతర దేశాల వీడియోలను హైదరాబాద్లో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.