అవి ప్రభుత్వ కార్యాలయాలు.. కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఏసీలు, జిరాక్స్ మిషన్లు ఇలా విద్యుత్ పరికరాలు నడుస్తూ ఉంటాయి. దీంతో నెలకు వేలల్లో బిల్లు వస్తుంది. నిధులు సర్కారు ఇచ్చినా.. ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచన అధికారులకు వచ్చింది. అనుకున్నదే తడవుగా సోలార్ ఏర్పాటు చేయించారు. దీంతో ఇప్పుడిక బిల్లు చెల్లించాల్సిన అవసరమే లేకుండా పోయింది.
సొంత ప్రయత్నం..కొంత ఆదాయానికి వెసులుబాటు కల్పిస్తుంది. ఖర్చును తగ్గించుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సర్కిల్ కార్యాలయాలకు వచ్చే విద్యుత్ చార్జీలు తగ్గించుకునేందుకు ఆదా మార్గాన్ని ఎంచుకున్నారు. నెలకు దాదాపు 50 వేల కరెంటు బిల్లును తగ్గించుకొని ఆదర్శంగా ముందుకు వెళ్తున్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తో ఇతర సర్కిళ్లకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నది.
కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో టీఎస్పీడీసీఎల్కు నెలకు దాదాపుగా 50 వేల విద్యుత్ బిల్లు చెల్లించేవారు. పరిపాలనకు కావాల్సిన పూర్తి సేవలను అందించేందుకు కార్యాలయంలో కరెంటు వాడకం రోజురోజుకూ పెరుగుతున్నది. దీనిని అధిగమించేందుకు ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో సోలార్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. సర్కిల్ కార్యాలయంపై 33 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ను ఏర్పాటు చేశారు. దీంతో నెలకు 4125 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది.
సర్కిల్ కార్యాలయంలో సుమారు 16 లక్షల 50 వేల వ్యయంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేశారు. నెలకు 50వేల బిల్లు చెల్లించాల్సిన దానిలోనే ఇప్పుడు స్వతహాగా విద్యుత్ ఉత్పత్తి కావడంతో మరో మూడేండ్లలో సోలార్ పలకలకు చేసిన మొత్తం ఖర్చు తిరిగి ఆదా అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏడాదికి రూ.6లక్షల కరెంటు బిల్లు ఆదా అవుతుందని వివరిస్తున్నారు. జంట సర్కిళ్లతోపాటు అల్వాల్ సర్కిల్లో 18 కిలోవాట్స్, మూసాపేట సర్కిల్కు 30 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. ఆయా సర్కిళ్లకు సైతం ఇదే సామర్థ్యంతో స్వశక్తితో ఆదా చేసుకోవడానికి కూకట్పల్లి జోనల్ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
వేసవిలో కరెంటు వినియోగం మరింత పెరుగుతుంది. దీనికి తోడు సర్కిళ్లలో వెచ్చించే ఖర్చులో అధిక శాతం కరెంటు బిల్లులకు చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్చును తగ్గించుకునేందుకు స్వశక్తితో విద్యుత్ను ఉత్పత్తి చేసేలా నాలుగు సర్కిళ్లకు సోలార్ ఏర్పాట్లు చేశాం. రాబోయే రోజుల్లో మరింత విద్యుత్ ఉత్పాదనకు తగు చర్యలు తీసుకుంటున్నాం. -రఘుపతిరెడ్డి, డీఈ కూకట్పల్లి జోనల్ ఎలక్ట్రికల్ విభాగం