న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలో అత్యంత ధనికులు ప్రైవేట్ విమానాల్లో దేశాన్ని వీడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోవడం, ఆక్సిజన్, మందుల కొరతతో వైద్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దీంతో పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్ దిశగా వెళ్తున్నాయి. భారత్లో కరోనా తీవ్రత నేపథ్యంలో పలు దేశాలు విమానాలను నిలిపివేశాయి. మరోవైపు మే నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని అల్ట్రా రిచ్పీపుల్ ప్రైవేట్ విమానాల్లో విదేశాలకు వెళ్తున్నారు. ముందు జాగ్రత్తగా ఐరోపా, మిడిల్ ఈస్ట్ దేశాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ జెట్ విమానాలకు బుకింగ్లు బాగా పెరిగాయి. అల్ట్రా రిచ్ వారే గాక ధనికులు కూడా ప్రైవేట్ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారని ఢిల్లీ కేంద్రంగా పని చేసే క్లబ్ ఒన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్రా తెలిపారు. లండన్, దుబాయ్, మాల్దీవులు వంటి దేశాలకు బాగా డిమాండ్ ఉందని చెప్పారు.
ముఖ్యంగా భారత్కు విమాన ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రైవేట్ జెట్స్కు బాగా డిమాండ్ పెరిగిందని రాజన్ వెల్లడించారు. దీంతో ప్రైవేట్ జెట్ ఛార్జీలు చాలా రెట్లు పెరిగినా దేశాన్ని వీడేందుకే ధనికులు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి దుబాయ్కు ఒక వైపునకు గ్రౌండింగ్, ఇతర ఛార్జీలతో కలిపి సుమారు 15 లక్షలు ఉంటుందన్నారు. విమానం ఖాళీగా తిరిగి రావాల్సి వస్తే మరింత ఎక్కువగా వసూలు చేస్తారని వివరించారు.
ఎకానమీ క్లాస్ బుకింగ్స్ సాధారణ ధర కంటే పది రెట్లు పెరిగిందన్నారు. అయినప్పటికీ బడా పారిశ్రామికవేత్తలు, సినీ స్టార్లు, ఇతర ప్రముఖులు వైద్యం, ఇతర కారణాలతో కెనడా, హాంకాంగ్, యూఏఈ, యూకే వంటి దేశాలకు ప్రైవేట్ విమానాల్లో వెళ్తున్నారని వెల్లడించారు.