వాషింగ్టన్: నిజం.. ఈ ప్రశ్న అడుగుతోంది ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్కే. తమ ప్లాట్ఫామ్పై తీవ్రవాదం పెరిగిపోతోందన్న విమర్శలు, చట్టసభల ప్రతినిధులు, హక్కుల సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గిన ఆ సంస్థ.. ఇప్పుడో కొత్త అలెర్ట్ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి అలెర్ట్స్ తమకు వస్తున్నాయని కొందరు వాటి స్క్రీన్షాట్స్ను ట్విటర్లో షేర్ చేయగా.. అది నిజమేనని ఫేస్బుక్ ధృవీకరించింది. మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా తీవ్రవాదిగా మారుతున్నారని మీరు ఆందోళన చెందుతున్నారా? మా ప్లాట్ఫామ్పై తీవ్రవాదాన్ని కట్టడి చేయడానికి కట్టుబడి ఉన్నాం. మీ పరిస్థితుల్లో ఉన్న ఇతరులు సాయం పొందారు. మీరు కూడా ఆ సాయం పొందండి అనే ఓ పాప్-అప్ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే కనిపిస్తున్నట్లు కొందరు యూజర్లు చెప్పారు.
మీరు ఈ మధ్య ప్రమాదకరమైన తీవ్రవాద కంటెంట్కు ఎక్స్పోజ్ అయి ఉంటారు అనే మరో అలెర్ట్ వార్నింగ్ కూడా ఇలాగే వస్తోంది. ఈ రెండు అలెర్ట్స్కి గెట్ సపోర్ట్ అనే లింక్స్ ఉన్నాయి. ఇలాంటి హింసాత్మక తీవ్రవాద, ద్వేషాన్ని రగిలించే కంటెంట్ను కట్టడి చేయడంలో భాగంగానే తాము ఈ పని చేస్తున్నట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఆండీ స్టోన్ వెల్లడించారు. ఇలాంటి కంటెంట్ విషయంలో సాయం చేసే సంఘాలకు గెట్ సపోర్ట్ ద్వారా రీడైరెక్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఓ పైలట్ ప్రాజెక్ట్గా ఈ చిన్న టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ తీవ్రవాద కంటెంట్ను తమ ప్లాట్ఫామ్ నుంచి పారదోలడానికి తాము ఎన్జీవోలు, విద్యా నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు స్టోన్ చెప్పారు. గత జనవరి 6వ తేదీన అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి తర్వాత ఫేస్బుక్లో వస్తున్న హింసాత్మక, తీవ్రవాద కంటెంట్ను కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బర్గ్ను యూఎస్ కాంగ్రెస్ పలుమార్లు ప్రశ్నించింది.