నారుమడి, నాట్లు లేకుండా సాగు
తక్కువ నీటి ఆదా.. కూలీల కొరతకు చెక్
సంప్రదాయ పంట కంటే ముందే దిగుబడి
యాసంగిలో 24 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 4: నాలుగేళ్ల క్రితం వేంసూరు మండలం కందుకూరుకు చెందిన అభ్యుదయ రైతు గొర్ల సత్తిరెడ్డి ప్రారంభించిన ఈ సాగు నేడు వేలాది మందికి ఆదర్శమైంది. రైతులు నేరుగా విత్తే పద్ధతిని అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అన్నదాతల ఆసక్తిని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ అధికారులు, వైరా కేవీకే శాస్త్రవేత్తలు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రయోజనాలను రైతులకు వివరించారు.
తక్కువ నీటి వనరులతోనే సాగు..
సంప్రదాయ పద్ధతిలో వరి సాగుతో పోల్చుకుంటే వెదజల్లే పద్ధతిలో రైతులకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పద్ధతిలో తక్కువ వర్షపాతం నమోదైన సందర్భంలోనూ సాగు చేపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా రెండో పంటను కూడా సకాలంలో పండించుకోవడానికి అనువుగా ఉంటుంది. సీజన్లో ఒకేసారి వరినాట్లు ప్రారంభమవుతుండడంతో కూలీల కొరత ఏర్పడుతుంది. వెదజల్లే పద్ధతి ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చు. దీంతో సన్న, చిన్నకారు రైతులకు ఆర్థికభారం కూడా తగ్గుతుంది. పంట పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రసాయన, క్రిమిసంహారక మందుల వాడకం కూడా తగ్గించొచ్చు. తక్కువ నీటి వనరులతోనూ సాగు చేసుకునేందుకు వీలుంటుంది. మెట్ట భూములతో పాటు మాగాణి భూముల్లోనూ వెదజల్లే పద్ధతి పాటించవచ్చు. నాణ్యమైన (ఏ-గ్రేడ్) దిగుబడి సాధించవచ్చు.
నాలుగు పద్ధతుల్లో వరి సాగు..
జిల్లావ్యాప్తంగా వరిసాగు చేసే రైతులు నాలుగు పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతితో పాటు ట్రాన్స్ప్లాంటేషన్, డ్రమ్సీడ్, వెదజల్లే పద్ధతిలో వానకాలం, యాసంగిలో సాగు చేపడుతున్నారు. వానకాలంతో పోల్చుకుంటే యాసంగిలో రైతులు నేరుగా విత్తే పద్ధతిలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.07 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. వీటిలో వెద్దజల్లే పద్ధతి అనుసరించి 10,300 మంది రైతులు 30 వేల ఎకరాలు, 4 వేల మంది రైతులు డ్రమ్సీడ్ పద్ధతిలో 6,908 ఎకరాల్లో సాగు చేపడుతున్నారు. తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి మండలాలకు చెందిన ఎక్కువ మంది రైతులు ఇలా సాగు చేపడుతున్నారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కూలీల అవసరం లేకుండా పని పూర్తవుతుండటంతో రైతులు ఈ పద్ధతులను అవలంబిస్తున్నారు.
మరింత నికర ఆదాయం
సాధారణ సాగు కంటే కరివేద పద్ధతి ద్వారా సాగు చేస్తే మరింత నికరం ఆదాయం లభిస్తుంది. సంప్రదాయ పద్ధతి సాగుతో పోల్చుకుంటే కరివేద పద్ధతితో అనేక ప్రయోజనాలున్నాయి. మెట్ట ప్రాంతంలో సాగు చేసే రైతులకు సాగు నీటి అవసరాలు తక్కువగా ఉంటాయి. తక్కువ నీటి వనరులతో, తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా పంట పెట్టుబడి విషయానికి వస్తే ఎకరం పొలంలో కరివేద పద్ధతి ద్వారా సాగు చేపడితే విత్తనం నుంచి మొదలు పంట చేతికి వచ్చే సరికి రూ.15,500 ఖర్చు అవుతుండగా.. సంప్రదాయ పద్ధతిలో సాగు చేపడితే ఎకరానికి ఒక్కో సీజన్కు రూ.26,350 ఖర్చవుతుంది. అంటే దాదాపుగా రూ.11 వేలు అదనంగా సాధారణ సాగుకు ఖర్చవుతుంది. కూలీల కొరత ఉండదు. ఇకపోతే పంట దిగుబడి విషయానికి వస్తే ఎకరం పొలంలో కరివేద పద్ధతి ద్వారా సాగు చేపట్టినట్లయితే ఎకరం పొలంలో సుమారు 35 బస్తాలు దిగుబడి వస్తుండగా, సాధారణ సాగు పద్ధతిలో సాగు చేసినట్లయితే 36 బస్తాల దిగుబడి వస్తుంది. దీంతో కరివేద పద్ధతి ద్వారా దిగుబడి మొత్తానికి గాను రూ.48,835 ఆదాయం వస్తుండగా, పంట పెట్టుబడి రూ.15,500 కాగా, నికర ఆదాయం రూ.32,668 సాగు రైతులకు మిగులుతుంది. ఇకపోతే సాధారణ సాగుకు సంబంధించి 36 బస్తాల దిగుబడికి గాను రూ.49,835 ఆదాయం వస్తుంది, పెట్టుబడి రూ 26,350 పోనూ నికర ఆదాయం సదరు రైతుకు రూ.23,195 మిగులుతుంది.
ఇవి కూడా చూడండి..
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
దేశ ప్రజలకు ప్రముఖుల ఈస్టర్ శుభాకాంక్షలు